Chief Justices: జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:44 AM
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సీజేఐలు పేర్కొన్నారు.
కానీ ఈసీకి అపరిమిత అధికారాలు సముచితం కాదన్న మాజీ సీజేఐలు
న్యూఢిల్లీ, జూలై 6: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు (సీజేఐలు) పేర్కొన్నారు. అయితే ఈ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి అపరిమిత అధికారాలు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. విచక్షణాధికారాల వినియోగానికి కమిషన్కు తగు మార్గదర్శకాలు అవసరమన్నారు. మాజీ సీజేఐలు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ జేఎస్ కేహర్.. జమిలి ఎన్నికల బిల్లుపై మాజీ మంత్రి పీపీ చౌధురి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. జస్టిస్ లలిత్ ఫిబ్రవరిలో, జస్టిస్ కేహర్ మార్చిలో కమిటీని కలిసి బిల్లులోని వివిధ అంశాలపై చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గొగోయ్ ఈ నెల 11న సదరు కమిటీతో సమావేశం కానున్నారు. ఏకకాలంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు. వేర్వేరుగా ఎన్నికలు జరపాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని జేపీసీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో ఈసీకి అత్యధిక అధికారాలు ఇవ్వడాన్ని ఆయన, జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు. చట్టప్రకారం అసెంబ్లీల కాలపరిమితి ఐదేళ్లు. లోక్సభతో పాటే ఎన్నికల పేరుతో.. ఈ గడువును కుదించేలా, పెంచేలా హద్దుల్లేని అధికారాన్ని ఈసీకి కట్టబెట్టడం సముచితం కాదన్నారు.