Union Cabinet: PM స్వానిధి గడువు పెంపు, రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:01 PM
కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్లు, ఆర్థిక ప్రణాళికలపై..
న్యూ ఢిల్లీ ఆగస్టు 27 : కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు కొత్త రైల్వే ప్రాజెక్టులు, అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్లు, ఆర్థిక ప్రణాళికలపై కేంద్ర మంత్రి వర్గం దృష్టి సారించింది. మొత్తం మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కచ్లోని దూర ప్రాంతాల కలయిక, పర్యాటకానికి ఊపిరినిచ్చేలా ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. రణ్ ఆఫ్ కచ్, హరప్పా స్థలం ధోలవిరా, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్, లాఖ్పట్ కోటకు రైలు సదుపాయం కల్పించ సంకల్పించారు. దీని ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 251 లక్షల మానవ పని దినాల ఉపాధి కలుగుతుంది.
ఈ ప్రాజెక్టుల వల్ల బొగ్గు, సిమెంట్, స్టీల్, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పెద్ద మేలు జరుగుతుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి. పర్యావరణ హితం, CO2 ఉద్గారాల నియంత్రణ కలుగుతుంది. కర్ణాటక, తెలంగాణ, బిహార్, అసోం రాష్ట్రాలకు మల్టీ-ట్రాకింగ్ ద్వారా కనెక్టివిటీ పెంపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల 13 జిల్లాలు లబ్ధి పొందుతాయి. 565 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల కలయిక జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 360 కోట్ల కిలోల CO2 తగ్గింపు జరుగుతుంది. ఇది 14 కోట్ల చెట్ల నాటిన దానికి సమానమైన ప్రయోజనం ఇస్తుంది.
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలపై చర్చ, తక్షణ చర్యలపై కేంద్ర క్యాబినెట్ చర్చించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో, ఈ మీటింగ్లో దీని ప్రభావాలను అంచనా వేసి, తీసుకోవాల్సిన ప్రణాళికల్ని రూపొందించారు. అటు గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) రంగానికి ప్రోత్సాహంపైనా చర్చించారు. మోదీ ఇటీవల గుజరాత్లో ప్రారంభోత్సవం చేసిన Suzuki e-Vitara గురించి కూడా క్యాబినెట్ చర్చించింది. డిఫెన్స్, స్పేస్ రంగాల్లో ప్రగతి గురించి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పేస్ మిషన్ విజయాన్ని ఈ మీటింగ్ లో స్వాగతించారు.
ప్రధాన మంత్రి స్వనిధి (PM SVANidhi) యోజన పునర్వ్యవస్థీకరణ, విస్తరణ గురించి క్యాబినెట్ చర్చించింది. ఈ పథకాన్ని 31 మార్చి 2030 వరకు విస్తరించారు. మొత్తం బడ్జెట్: రూ. 7,332 కోట్లు. ఈ పథకం కింద 1.15 కోట్లకు పైగా స్ట్రీట్ వెండర్లు (వీధి వ్యాపారులు) ప్రయోజనం పొందుతారు. ఇది చిన్న వ్యాపారులను ఆత్మనిర్భర్గా మార్చడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారులకు రుణాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.
🔹 PM స్వనిధి పథకం గడువు 2030 మార్చి 31 వరకు పొడిగింపు
🔹 పథకం వ్యయం – రూ. 7,332 కోట్లు
🔹 1.15 కోటి వీధి వ్యాపారులకు లబ్ధి, వీరిలో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు
🔹 మొదటి రుణం: రూ. 15,000 – రెండో రుణం: రూ. 25,000 – మూడో రుణం: రూ. 50,000
🔹 వీధి వ్యాపారులకు అందుబాటులోకి UPI లింక్ RuPay క్రెడిట్ కార్డు
🔹 డిజిటల్ లావాదేవీలపై గరిష్టంగా రూ. 1,600 క్యాష్బ్యాక్
🔹 FSSAI తో కలిసి వీధి ఆహార వ్యాపారులకు హైజీన్ & ఫుడ్ సేఫ్టీ శిక్షణలు
🔹 ‘SVANidhi se Samriddhi’ కింద నెలవారీ లోక్ కళ్యాణ్ మేళాలు
🔹 ఇప్పటివరకు 96 లక్షల రుణాలు – రూ. 13,797 కోట్లు పంపిణీ
🔹 47 లక్షల లబ్ధిదారులు 557 కోట్ల డిజిటల్ లావాదేవీలు – రూ. 6.09 లక్షల కోట్లు
🔹 ఈ పథకానికి PM అవార్డు (2023), సిల్వర్ అవార్డు (2022) అవార్డులు
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News