PM Modi: 2050కల్లా 44 కోట్ల మందికి ఊబకాయం
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:16 AM
జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు మన ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో ఊబకాయం ఒకటని, అనేక జబ్బులకు ఇదే మూలకారణమని చెప్పారు.
బరువు తగ్గడంపై ప్రజలు దృష్టి పెట్టాలి:మోదీ
సిల్వస, మార్చి 7: జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు మన ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో ఊబకాయం ఒకటని, అనేక జబ్బులకు ఇదే మూలకారణమని చెప్పారు. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది ప్రజలు ఊబకాయ సమస్య బారిన పడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. శుక్రవారం ఆయన కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వస పట్టణంలో రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఊబకాయం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వంట నూనెల వినియోగం 10 శాతం తగ్గించాలని తాను ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశానన్నారు. అందరూ 10 శాతం తక్కువగా వంట నూనెలను కొనుగోలు చేస్తామని ప్రతినబూనాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సైక్లింగ్ చేయాలని చెప్పారు.