Karnataka HC-Caste Survey: కులగణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమే: కర్ణాటక హైకోర్టు
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:10 PM
కులగణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమేని కర్ణాటక హైకోర్టు తాజాగా పేర్కొంది. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కర్ణాటక: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణ సర్వేపై స్టే విధించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సర్వేలో పాల్గొనడం ప్రజల ఐచ్ఛికమేనని పేర్కొంది. ఇదేమీ తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేయాలనీ పేర్కొంది. అన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలంటూ సర్వేయర్లు ప్రజలను బలవంతం చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ సర్వేలో సేకరించిన వివరాలను జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపింది. కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు మాత్రమే ఈ వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. (Karnataka Caste Survey Voluntary).
కులగణన చేపడుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. సర్వే చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పిటిషనర్లు ప్రశ్నించడం లేదని అన్నారు. కేవలం సర్వే జరుగుతున్న తీరుపైనే పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు (High Court Karnataka survey ruling). ఇక సర్వే విధానంలో ఏకరమైన తప్పులు ఉన్నాయో పిటిషనర్లు వివరించనందున ఈ దశలో స్టే అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. వెనుకబడిన తరగతుల ప్రయోజనార్థం చేపడుతున్న సర్వే ప్రజల హక్కులను ఉల్లంఘించట్లేదని పేర్కొంది.
ఇక ప్రజలు సర్వేలో పాల్గొనకుండా తిరస్కరించే అవకాశాన్ని సర్వే హ్యాండ్ బుక్లో ఎందుకు పేర్కొనలేదని హైకోర్టు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ను ప్రశ్నించింది. ప్రతి ఇంటిని సర్వే చేయాలని సర్వేయర్లకు మార్గదర్శకాలు ఉన్న విషయాన్ని కూడా పేర్కొంది. దీనిపై కమిషన్ తరఫు న్యాయవాది స్పందించారు. ప్రజలు తమకు సమాచారం ఇవ్వలేదని రికార్డు చేసుకునేందుకు సర్వేయర్లను అనుమతించిన విషయాన్ని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్నే రికార్డు చేసుకోవాలని ఎన్యూమరేటర్లకు చెప్పినట్టు వివరించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులతోనూ చర్చలు జరిపామని అన్నారు. ఈ సందర్భంగా ఆధార్ నెంబర్లు సేకరించడంపైనా హైకోర్టు కమిషన్ను ప్రశ్నించింది. అయితే, ప్రజల నుంచి సేకరించిన నెంబర్లు, అందరికీ అందుబాటులో ఉండవని, కాబట్టి దుర్వినియోగమయ్యే ముప్పు లేదని భరోసా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
బేబీ అంటూ మెసేజీలు ఆ తరువాత బెదిరింపులు.. ఢిల్లీ బాబాపై విచారణలో షాకింగ్ వాస్తవాలు
ఉత్తర్ ప్రదేశ్ను డిఫెన్స్ హబ్గా మారుస్తున్నాం: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి