Share News

IWT Treaty: సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాక్‌కు చుక్కలు.. భారత్‌కు వరుస లేఖలు

ABN , Publish Date - Jun 06 , 2025 | 08:34 PM

సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ పాక్ ఇప్పటివరకూ భారత్‌కు ఏకంగా నాలుగు లేఖలు రాసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

IWT Treaty: సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాక్‌కు చుక్కలు.. భారత్‌కు వరుస లేఖలు
Indus Waters Treaty crisis

ఇంటర్నెట్ డెస్క్: సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. ఒప్పందం నిలుపుదలపై పునరాలోచించాలంటూ భారత్‌కు ఇప్పటివరకూ ఏకంగా నాలుగు లేఖలు రాసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడికి కారణమైన పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.

భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తాజా ఈ లేఖలు రాసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిని హోంశాఖకు జల మంత్రిత్వశాఖ పంపించినట్టు వెల్లడించాయి.

ఎగువ దేశమైన భారత్ నుంచి సింధు నీరు అందక పాక్‌లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో, ఒప్పందంపై పునరాలోచించాలంటూ భారత్‌కు పాక్ వరుసపెట్టి లేఖలు రాస్తోంది.


సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలను భారత్ సమర్థించుకుంది. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ఉండాలన్న తలంపుతో ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాక్.. ఈ ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా పేర్కొంది.

మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో ఇక్కట్లు తప్పవని పాక్‌ రాజకీయ నేతలు భయపడిపోతున్నారు. ఈ విషయంలో ఏదోక పరిష్కారం చూపించాలని పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ఈ నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించని పక్షంలో మాకు ఆకలి చావులు తప్పవు. సింధు నదీ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీరే మాకు జీవనాధారం. ఈ నీటిలో మూడో వంతు పాక్ ఆవల నుంచి వస్తుంది. పాక్‌లోని ప్రతి 10 మందిలో 9 మందికి ఈ నీరే జీవనాధారం’ అని పాక్ సెనెటర్ సయ్యద్ అలీ జఫర్ మే నెలలోనే భయాందోళనలు వెలిబుచ్చారు.


పాక్, భారత్ మధ్య సింధు నదీ జలాల పంపిణీ కోసం 1960లో ఈ ఒప్పందం కుదిరింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఒప్పందం స్ఫూర్తికి తూట్లు పొడిచిందని భారత్ మండిపడింది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కుదిరిన ఈ ఒప్పందానికి మారిన పరిస్థితుల రీత్యా మార్పులు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 09:39 PM