Water ATM: ఊటీలో.. ‘వాటర్ ఏటీఎం’ ఏర్పాటు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:52 PM
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
చెన్నై: ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీ(Ooty)లో, క్యూ ఆర్ కోడ్తో ఐదు ప్రాంతాల్లో కొత్త వాటర్ ఏటీఎం(Water ATM)లు ఏర్పాటుచేశారు. నీలగిరి(Neelagiri) జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ బ్యాగులు సహా 21 రకాల వస్తువుల వినియోగంపై నిషేధం విధించారు. అనంతరం, జిల్లాకు వచ్చే పర్యాటకుల సౌకార్యర్ధం జిల్లా వ్యాప్తంగా 45 వాటర్ ఏటీఎంలు ఏర్పాటుచేశారు. స్థానిక సంస్థల పర్యవేక్షణ లోపంతో పలు ఏటీఎంలు నిరుపయోగంగా ఉన్నాయి.
అదే సమయంలో, వాటర్ ఏటీఎంలో వస్తున్న నీటి నాణ్యతపై కూడా పర్యాటకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం, ప్రైవేటు సంస్థతో కలసి పర్యాటకులు, ప్రజలు అధికంగా చేరే ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే, బోట్ హౌస్ కాంప్లెక్స్లో వేడి నీటితో కూడిన కొత్త వాటర్ ఏటీఎం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటు సంస్థతో కలసి తలా రూ.3 లక్షలతో ఐదు వాటర్ ఏటీఎంలు ఏర్పాటుచేశామన్నారు. ఈ ఏటీఎంలలో చల్లటి, వేడి నీరు వచ్చేలా ఏర్పాటుచేశామన్నారు. ఈ ఏటీఎంల పర్యవేక్షణ మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించామని తెలిపారు. ఈ కొత్త ఏటీఎంలో క్యూ ఆర్ స్కాన్ ద్వారా అర లీటరు రూ.5, ఒక లీటరు రూ.10 ధర చెల్లించి తాగునీటి పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News