Kumbh Mela: మహా కుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ల మీద పరీక్ష జరిపి..
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:14 AM
ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు(యూపీపీసీబీ) దాఖలు చేసిన ప్రమాణపత్రంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మండిపడింది. మేళా మొదలు కావడానికి ముందు రోజైన జనవరి 12న సేకరించిన నమూనాలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ నివేదిక ఇస్తారా?
మా సమయాన్ని వృథా చేయడానికా?.. 250 పేజీల్లో ఫీకల్ కొలీఫామ్ ప్రస్తావనే లేదు
కుంభమేళాలో నీటి కాలుష్యానికి సంబంధించి యూపీపీసీబీ అఫిడవిట్పై ఎన్జీటీ ఆగ్రహం
సీపీసీబీ నివేదికతో విభేదిస్తున్నారా అని నిలదీత.. వారంలో కొత్త నివేదిక ఇస్తామన్న యూపీ
కుంభమేళాలో మహిళా భక్తుల స్నానాల వీడియోలు!.. విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహా కుంభమేళా స్నానఘట్టాల్లో నీటి నాణ్యతకు సంబంధించి.. ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు(యూపీపీసీబీ) దాఖలు చేసిన ప్రమాణపత్రంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మండిపడింది. మేళా మొదలు కావడానికి ముందు రోజైన జనవరి 12న సేకరించిన నమూనాలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాగరాజ్లోని త్రివేణీ సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా ఉందని..

ఆ నీటిలో ‘ఫీకల్ కొలీఫామ్’ నిర్ణీత స్థాయులకు మించి ఉందని, ఆ నీరు స్నానానికి పనికిరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఎన్జీటీకి ఇటీవలే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న యూపీపీసీబీ ఆ నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. ప్రయాగరాజ్లో నీటి నాణ్యత చాలా బాగుందని అందులో పేర్కొంది.
ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ సుధీర్ అగర్వాల్, ఎక్స్పర్ట్ మెంబర్ ఎ.సెంథిల్ వేల్తో కూడిన బెంచ్.. 19న దీనిపై విచారణ జరిపింది. యూపీపీసీబీ తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్.. నీటి నమూనాలు ఎక్కడ సేకరిస్తోందనే విషయంపై సీపీసీబీ నుంచి తమకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు. నీటిలో కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదికను మంగళవారమే సమర్పించినట్టు తెలిపారు. ‘‘అసలు మీరిచ్చిన 250 పేజీల నివేదికలో ఫీకల్ కొలీఫామ్ స్థాయుల గురించి ఎక్కడా లేదు. పైగా ఆ నమూనాలు సేకరించింది జనవరి 12న. ఈ మాత్రం దానికి అంత పెద్ద డాక్యుమెంట్ ఎందుకు సమర్పించారు? మా సమయాన్ని వృథా చేయడానికా?’’ అని నిప్పులు చెరిగింది. ‘సీపీసీబీ నివేదికతో విభేదిస్తున్నారా? దాన్ని సవాల్ చేస్తున్నారా?’ అని నిలదీసింది. దీనికి ఏఏజీ.. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, ఇటీవలే యూపీపీసీబీ కొన్ని నమూనాలు సేకరించిందని, ఆ వివరాలన్నింటితో కలిపి కొత్త అఫిడవిట్ను వారం రోజుల్లోగా దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్జీటీ తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
మహిళా భక్తుల స్నానాల వీడియోలు!
లఖ్నవూ: మహాకుంభమేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసి ఆ వీడియోలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తులపై యూపీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండు సోషల్ మీడియా ఖాతాలపై న్యాయపరమైన చర్యలు చేపట్టారు. ప్రయాగ్రాజ్లోని గంగానదిలో మహిళలు స్నానం చేస్తున్న, దుస్తులు మార్చుకుంటున్న వీడియోలను కొందరు దుండగులు సోషల్ మీడియా వేదికల్లో రూ.2,000-3,000 చొప్పున విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా ఈ తరహా వీడియోలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News