Namo Bharat Train Sets Record: నమో భారత్ 160 కి మీ
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:13 AM
దేశంలో అత్యంత వేగవంతమైన రైలు అంటే ఇప్పటి వరకు మనకు వినిపించే పేరు ‘వందే భారత్’! అయితే ఇప్పుడు 55 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ సెక్షన్ మధ్య నడిచే ‘నమో భారత్’ రైలు...
దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: దేశంలో అత్యంత వేగవంతమైన రైలు అంటే ఇప్పటి వరకు మనకు వినిపించే పేరు ‘వందే భారత్’! అయితే ఇప్పుడు 55 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ సెక్షన్ మధ్య నడిచే ‘నమో భారత్’ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని.. అత్యంత వేగవంతమైన ట్రైన్గా రికార్డు సృష్టించింది. అంతకుముందు 2016లో ప్రారంభించిన గతిమాన్ ఎక్స్ప్రెస్ వేగమైన రైలుగా ఉండేది. ఇది దేశంలో తొలి సెమీ-హైస్పీడ్ ట్రైన్ కూడా కావడం గమనార్హం. హజరత్ నిజాముద్దీన్, ఆగ్రా మధ్య ప్రత్యేకంగా వేసిన ట్రాక్లపై గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేది. తర్వాత సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ను ప్రవేశపెట్టినప్పుడు.. ఆ ట్రైన్ కూడా అదే గరిష్ఠ వేగంతో నడిచేది. అయితే 2024 జూన్ 24న రైల్వే మంత్రిత్వ శాఖ వాటి వేగాన్ని గంటకు 160 నుంచి 130 కిలోమీటర్లకు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తున్నాయి. నమో భారత్ తూర్పు ఢిల్లీలోని న్యూఅశోక్ నగర్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ సౌత్ మధ్య సేవలు అందిస్తోంది. ఆ మార్గంలోని 11 స్టేషన్లలో కొన్నింటి మధ్య కొన్ని సెకన్ల పాటు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఢిల్లీలోని సరై కాలే ఖాన్, యూపీలోని మోదీపురం మధ్య మొత్తం 16 స్టేషన్లతో కూడిన 82.15 కిలోమీటర్ల కారిడార్ త్వరలో అందుబాటులోకి రానుందని నేషనల్ క్యాపిటల్ రీజినల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్సీఆర్టీసీఎల్) అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News