Leopard in Maharashtra: మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:31 PM
మహారాష్ట్రలోని నాగ్పూర్లో చిరుత సంచారం కలకలానికి దారి తీసింది. చిరుత దాడిలో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో బుధవారం చిరుత సంచారం కలకలానికి దారి తీసింది. శివ్నగర్ ప్రాంతంలో జనావాసాల్లోకి చిరుత దూసుకురావడంతో స్థానికులు కంగారు పడిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో సుమారు ఏడుగురు గాయపడ్డారు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు (Maharashtra Leopard Attack).
ఉదయం 7.30 గంటలకు చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిందని హానరరీ వైల్డ్లైఫ్ వార్డెన్ అజింక్యా భట్కార్ మీడియాకు తెలిపారు. దీంతో, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్.. ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. ఉదయం 9.30 గంటల సమయంలో రంగంలోకి దిగిన సిబ్బంది చిరుతకు మత్తు మందు ఇచ్చి బంధించారు. గంటసేపట్లో ఈ ఆపరేషన్ పూర్తయ్యింది. అటవీ శాఖ సిబ్బంది చిరుతను ట్రాన్సిట్ ట్రీట్మెంట్ కేంద్రానికి తరలించారు. అది మగ చిరుత అని, సుమారు మూడేళ్ల వయసు ఉంటుందని తెలిపారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. జనావాసాల మధ్యకు వచ్చిన చిరుత భవంతుల మధ్య దూకుతూ ఇబ్బంది పడింది. ఓ భవనంపై నుంచి మరోచోటుకు దూకే ప్రయత్నంలో పట్టుకోల్పోయి గోడను పట్టుకుని వేళ్లాడింది. కాసేపు శ్రమించి చివరకు భవనంపైకి చేరుకుంది. చుట్టుపక్కల వారందరూ మేడలపైకి ఎక్కి ఈ సన్నివేశాలను ఆశ్చర్యపోతూ చూశారు.
చిరుతను బంధించామని, స్థానికులకు అపాయం తప్పిపోయిందని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ తెలిపారు. ఆ ప్రాంతంలో చిరుత మళ్లీ కనబడితే ఫారెస్టు డిపార్ట్మెంట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తారని అన్నారు. చిరుత దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తాను సందర్శించానని, వారికి ఎలాంటి అపాయం లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
శశిథరూర్కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడంలేదన్న ఎంపీ
జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి