India Mock Drills: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా డ్రిల్
ABN , Publish Date - May 07 , 2025 | 05:25 AM
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మాక్ డ్రిల్స్ నిర్వహణ. పౌర భద్రత, అగ్ని ప్రమాదాలు, మరియు అత్యవసర పరిస్థితులకు స్పందించే విధానం బలపడించేందుకు ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు
పహల్గాం దాడి, పాకిస్థాన్-ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు దళాలు ఇప్పటికే నిఘాను తీవ్రతరం చేశాయి. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్, జన్పథ్ వంటి కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. ఇక బుధవారం మాక్ డ్రిల్లో భాగంగా చండీగఢ్లో.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో 10 నిమిషాలపాటు బ్లాక్ అవుట్ డ్రిల్ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో సైరన్ మోగించడం మొదలుపెడతామని.. అది 10 నిమిషాలపాటు మోగుతుందని.. అది మోగినంతసేపూ పౌరులందరూ తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపారసముదాయాల్లో విద్యుద్దీపాలను ఆపేయాలని.. ఎవరూ జనరేటర్లు, ఇన్వర్టర్లను వాడొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వీలైనంతవరకూ ఆ సమయంలో పౌరులందరూ ఇళ్లల్లోనే ఉండడానికి ప్రయత్నించాలని.. రోడ్లపై ప్రయాణిస్తున్నవారు తమ వాహనాలను ఒక పక్కగా పార్క్ చేసి హెడ్లైట్లను ఆపేయాలని సూచించారు.
ఆస్పత్రులు, క్లినిక్లు, వైద్య సంస్థలకు మాత్రం ఈ డ్రిల్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇది కేవలం మాక్ డ్రిల్ మాత్రమేనని.. ప్రజలు అనవసరంగా కంగారుపడి, ఆందోళనకు గురికావొద్దని.. పెట్రోల్, డీజిల్, ఆహారం వంటివాటిని పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవద్దని సూచించారు. కాగా, అజ్మల్ కసబ్ అతడి సహచర ఉగ్రవాదులు 2008లో ముంబైలోకి ప్రవేశించింది సముద్రమార్గంలోనే. అందుకే మహారాష్ట్ర సర్కారు తీర ప్రాంతాల్లో భద్రత సన్నద్ధతపై దృష్టి సారించింది. సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, ఇతరత్రా అత్యవసర విభాగాల మధ్య సమన్వయాన్ని ఈ మాక్ డిల్ర్లో పరిశీలించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫైర్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ను (అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే జాగ్రత్తలు), క్యాజువాలిటీ రెస్పాన్స్ను పరీక్షించనున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. జమ్ముకశ్మీర్లో పోలీసులు, విపత్తు స్పందన దళాలు, పర్యాటకుల భద్రతకు సంబంధించిన గస్తీ దళాలు దాల్ సరస్సుపై డ్రిల్స్ నిర్వహించనున్నారు. అలాగే, ఆ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థులకు.. సైరన్లు మోగినప్పుడు, వైమానిక దాడులకు సంబంధించిన సంకేతాలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో నేర్పిస్తారు.
పంజాబ్లో మొత్తం 23 జిల్లాలుండగా.. వాటిలో 20 జిల్లాల్లో పౌర భద్రత విభాగాలు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి. ఒడిశాలో మాక్ డ్రిల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ అవుట్ సిమ్యులేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేమోఫ్లేజ్ వంటివి నిర్వహించనున్నారు. కర్ణాటకలో బెంగళూరు, కర్వార్ (ఉత్తర కర్ణాటక- అక్కడ కైగా న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం ఉంది), రాయ్చూర్లో (అక్కడ థర్మల్ పవర్స్టేషన్ ఉంది) మాక్డ్రిల్ నిర్వహించనున్నారు.ఇలా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మాక్ డ్రిల్స్ నిర్వహణకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. పౌర భద్రత వలంటీర్లు ఈ డ్రిల్లో భాగమవుతారని ఆ వర్గాలు వెల్లడించాయి.