Encounter: ఎన్కౌంటర్లో మావోయిస్టు మరో అగ్రనేత హతం
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:29 PM
ఛత్తీస్గఢ్లో వరుసగా రెండో రోజూ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మరో అగ్రనేత హతమయ్యారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ మావోయిస్టు తలపై రూ.25లక్షల రివార్డు ఉంది.
రాయ్పూర్, జూన్ 06: ఛత్తీస్గఢ్లో వరుసగా రెండో రోజూ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతిచెందారు. ఆడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా మావోలు, భద్రతా దళాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
గురువారం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని మావోయిస్టులు పసిగట్టారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో వారు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మరణించారు. అతడి తలపై రూ. కోటి రివార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు సైతం మృతిచెందిన విషయం విదితమే. ఇదే ప్రాంతంలో భారీగా ఆయుధాలను సైతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఛత్తీస్గఢ్లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ప్రభుత్వం ఎదుట మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకొంతమంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన కామాంధులు.. బాలికపై సామూహిక అత్యాచారం
మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. హాజరైన అభ్యర్థులు
For National News And Telugu News