IndiGo ReFund: ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:50 PM
ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌర విమానయాన శాఖ తాజాగా తెలిపింది. ప్రయాణికుల లగేజీని కూడా తిరిగిచ్చినట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం.. ప్రయాణికులకు టిక్కెట్ డబ్బులను రీఫండ్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. సుమారు 3000 వేల వరకూ సూట్కేసులు, ఇతర లగేజీని కూడా తిరిగిచ్చినట్టు తెలిపింది (IndiGo Rs. 610 Cr Refund).
ఇక ఇండిగో కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారాల్లో ఇండిగో రోజుకు సగటున 2,300 ఫ్లైట్ సర్వీసులు నిర్వహిస్తుంటుంది. నేడు 1,500 విమాన సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేసింది. డిసెంబర్ 10 నాటికి పూర్తిస్థాయిలో నెట్వర్క్ స్థిరీకరణ జరుగుతుందని కూడా సంస్థ అంచనా వేస్తోంది. సమయ పాలనకు సంబంధించి త్వరలో 75 శాతం మార్కును చేరుకుంటామని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ సిబ్బందికి తాజాగా పంపిన అంతర్గత మెసేజీలో పేర్కొన్నారు.
ఇక ఫ్లైట్ల రద్దుపై వివరణ కోరుతూ డీజీసీఏ.. సంస్థ సీఈఓకు, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కేరాస్కు ఇటీవలే షో కాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఎయిర్లైన్స్పై రాజకీయ విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఇండిగో మేనేజ్మెంట్, పౌర విమానయాన శాఖ వైఫల్యం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, ఫ్లైట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం వివిధ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రైల్వే అదనపు రైలు సర్వీసులు ప్రారంభించింది. త్వరలో డిమాండ్ను బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు తెస్తామని కూడా రైల్వే అధికారులు ఇటీవల తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి