Operation Sindoor: యుద్ధ బీభత్సం
ABN , Publish Date - May 09 , 2025 | 03:25 AM
భారత్పై పాక్ బుధవారం అర్ధరాత్రి రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ సకాలంలో ప్రతిస్పందించి ప్రమాదాన్ని తిప్పికొట్టింది. ప్రతిగా భారత్ పాక్లోని 9 నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థలపై విజృంభించింది.

బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు
క్షిపణులు, డ్రోన్లతో 15 నగరాలపై గురి
సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం
తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ
ఎస్400, ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణుల కూల్చివేత
పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్
లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై గురి
సియాల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం!
రెచ్చిపోయిన పాక్.. సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం
జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లో పేలుళ్లు, సైరన్లు
అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లు
పహల్గాం దాడితో ఉద్రిక్తతలకు తెరలేపింది పాకే!
భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే
ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలా?: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
జమ్ము, శ్రీనగర్, చండీగఢ్, మే 8: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! సైరన్లు మోగుతున్నాయి! సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి! ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్థాన్.. సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్ము నగరం, ఉధంపూర్లో మూడు పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్ము యూనివర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే.. సట్వారీలోని జమ్ము విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పాకిస్థాన్ ఎనిమిది క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్ర సంస్థ తరహాలో ‘చవకబారు’ రాకెట్లను ప్రయోగిస్తోందని, సట్వారీ (జమ్ము విమానాశ్రయం), సాంబ, ఆర్ఎస్ పుర, అర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, వాటన్నిటినీ మధ్యలోనే అడ్డుకుని కూల్చేశామని వివరించాయి. హమాస్ తరహాలోనే పాకిస్థాన్ ఆర్మీ కూడా వ్యవహరిస్తోందని మండిపడింది. నెల కిందట పాక్ ఆక్రమిత కశ్మీరులో ఐఎ్సఎస్, హమాస్ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగిన విషయాన్ని ఉటంకించింది. పాక్ డ్రోన్లు, రాకెట్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేస్తుండడంతో అక్కడ భారీ పేలుళ్లు జరుగుతున్నాయా అన్నట్లు పెద్దఎత్తున శబ్ధాలు వస్తున్నాయి. అలాగే, కుప్వారా, బారాముల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ భారీ ఎత్తున గుళ్ల వర్షం కురిపిస్తోంది. అయినా, అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి.
బుధవారం రాత్రి నుంచే..
ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో రగిలిపోతున్న దాయాది దేశం భారత్లోని 15 ప్రధాన నగరాల్లోని ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. జమ్ముకశ్మీర్ నుంచి గుజరాత్ దాకా.. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని 15 నగరాలపై బుధవారం అర్ధరాత్రి దాటాక చైనాకు చెందిన మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ.. పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్న భారతసైన్యం ఆ దాడులను దీటుగా తిప్పికొట్టింది. ఎస్-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ను ఉపయోగించి.. భారత్వైపు దూసుకొస్తున్న క్షిపణులను గాల్లోనే పేల్చేసింది. పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేసినట్టు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పాకిస్థాన్ దాడులేనని నిరూపించేందుకు.. పలు ప్రాంతాల్లో కూలిన క్షిపణుల శిథిలాలను సేకరిస్తున్నట్టు పేర్కొంది. ఇక. పాకిస్థాన్ దాడులకు ప్రతిగా మన సైన్యం లాహోర్, కరాచీ, రావల్పిండి సహా పాకిస్థాన్లోని తొమ్మిది నగరాల్లో గగనతల రక్షణ, రేడార్ వ్యవస్థలే దాడులు జరిపింది. ఈ దాడుల్ల్లో సియాల్కోట్, లాహోర్తోపాటు మరోనగరంలో హెచ్క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ లాంచర్లు పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ దాడులను కూడా భారత ప్రభుత్వం తన ప్రకటనలో ధ్రువీకరించింది. ‘‘గురువారం ఉదయం భారత సైన్యం పాకిస్థాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను, రేడార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది’’ అని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా.. లాహోర్లోని గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్టు సమాచారం ఉందని వెల్లడించింది. పాక్ చేసిన దాడుల తీవ్రత, స్థాయికి సమంగానే తమ ప్రతిస్పందన ఉందని భారత్ తేల్చిచెప్పింది. మరోవైపు.. జమ్ముకశ్మీర్లోనియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులను తీవ్రతరం చేసిందని.. కుప్వాడా, బారాముల్లా, యూరీ, పూంచ్, మెంధార్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్కు పాల్పడుతోందని తెలిపింది. ఇక.. సరిహద్దు గ్రామాల్లో సాధారణ పౌరులే లక్ష్యంగా బుధవారం నుంచి పాక్ జరుపుతున్న కాల్పుల్లో మృతుల సంఖ్య 16కు పెరిగిందని వెల్లడించింది. కాగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా.. పలు జిల్లాల్లో పోలీసు, ప్రభుత్వ సిబ్బంది సెలవులను రద్దుచేశాయి. పాఠశాలలను మూసివేశాయి. ఎల్వోసీ వెంబడి వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్లోని 21 విమానాశ్రయాలను శనివారం దాకా మూసివేశారు. అటు బంగ్లాదేశ్తో సరిహద్దులను కలిగి ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. గతంలో మంజూరు చేసిన సెలవులను కూడా ఉపసంహరించి.. ఉద్యోగులంతా విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
అన్నీ అబద్ధాలే..
పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడికి కుట్రపన్నడం ద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దాయాది దేశమే తెరలేపిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గుర్తుచేశారు. భారత్ ఆ దాడికి ప్రతిస్పందించిందని.. ఉద్రిక్తతలను ఇంకా పెంచాలనుకోవట్లేదని.. పాక్ గనక ఇంకా ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తే, అందుకు భారతదేశ ప్రతిస్పందన అదేస్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి.. గురువారం సాయంత్రం కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత యుద్ధ విమానాలను తాము కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ పుట్టినప్పటి నుంచే అబద్ధాలు ఆడడం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. ‘‘1947లో జమ్ముకశ్మీర్ తమదేనని ప్రకటించుకున్న పాకిస్థాన్ సాధారణ వ్యక్తులకు కాక.. ఏకంగా ఐక్యరాజ్యసమితికే అబద్ధాలు చెప్పింది. ఈ (పాక్ అబద్ధాల) ప్రయాణం 75 సంవత్సరాల క్రితమే మొదలైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నీలం-జీలం ఆనకట్టను, తమ దేశంలోని మతప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడుతోందంటూ పాక్ చేస్తున్న ఆరోపణ.. పూర్తిగా అబద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారతదేశం.. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని స్పష్టం చేశారు. భారత్లోని ఆనకట్టల వంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపే ఉద్దేశంతో పాక్ ఈ ఆరోపణలు చేస్తుంటేగనక.. పర్యవసానాలకు పూర్తి బాధ్యత ఆ దేశానిదేనని హెచ్చరించారు. అలాగే.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు కేంద్రస్థానమన్న సంగతి ప్రపంచం మొత్తానికీ తెలుసని మిస్రీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి, వారికి ఆశ్రయం ఇవ్వడానికి మతప్రదేశాలను ముసుగుగా పాక్ వాడుకుంటోందని మండిపడ్డారు. ‘‘ఒసామాబిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో.. ఎవరు అతణ్ని అమరవీరుడని పిలుస్తారో నేను ప్రత్యేకంగా గుర్తుచేయనక్కర్లేదు. ఐక్యరాజ్యసమితితోపాటు వివిధ దేశాలు నిషేధించిన ఎంతో మంది ఉగ్రవాదులకు పాకిస్థానే నివాసస్థానం. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, రక్షణ మంత్రి సైతం తమ దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్టు ఇటీవలే ఒప్పుకున్న విషయం తెలిసిందే’’ అని ఆయన పేర్కొన్నారు. పహల్గాం దాడి తమపనేనని టీఆర్ఎఫ్ ప్రకటించినా.. పాక్ మాత్రం ఐరాసలో ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదని గుర్తుచేశారు. పాక్ జాతీయ పతాకంతో చుట్టిన శవపేటికల్లో పౌరుల మృతదేహాలను ఉంచి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మాకు తెలిసినంతవరకూ అక్కడ చనిపోయింది ఉగ్రవాదులే. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం బహుశా పాకిస్థాన్ సంప్రదాయమేమో’’ అని వ్యంగ్యంగా అన్నారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోందని మిస్రీ మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్లో పాకిస్థాన్ సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. పూంచ్లో ఒక గురుద్వారాపై దాడి చేసింది. అందులో ముగ్గురు చనిపోయారు. పూంచ్తోపాటు ఇతర ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. పాక్ గనక భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే తామూ అదేవిధంగా స్పందిస్తామని సోఫియా ఖురేషీ తేల్చిచెప్పారు.
చిమ్మ చీకట్లో..
డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. జమ్ము, చండీగడ్, మొహాలీ, అమృత్సర్, పఠాన్కోట్ తదితర ప్రాంతాల్లో బ్లాకవుట్ చర్యలు చేపట్టారు. అలాగే, ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోవాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి ఆ ప్రాంతాలన్నీ చిమ్మ చీకట్లలో మునిగిపోయాయి. శత్రు దేశాలు రాకెట్లు దూసుకొస్తున్న సమయంలో.. సరిహద్దు ప్రాంతాల్లో లైట్లన్నీ ఆర్పేయాలని సూచిస్తారు. దీనినే బ్లాకవుట్ అంటారు. ఆ సమయంలో ఇళ్లల్లోనూ, బయటా మొత్తం లైట్లు ఆర్పేయడంతో అక్కడ చిమ్మచీకట్లు నెలకొంటాయి.
పాక్లో భారీ పేలుళ్లు.. భయాందోళనలు..
లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన భారీ పేలుళ్లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. అంతకుముందు.. కరాచీలోని షరాఫీ గోత్ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ రెండు ప్రధాన నగరాల్లోనే కాదు.. రావల్పిండి, గుర్జన్వాలా, చక్వాల్, అటోక్, బహావల్పూర్, మియాన్వాలి, ఛోర్ నగరాలపై భారత్ 12 హెరాన్ డ్రోన్లతో దాడి చేసినట్టు పాకిస్థాన్ డీజీ ఐఎ్సపీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ‘‘బుధవారం రాత్రి భారత్ పాక్లోని పలు ప్రాంతాలకు డ్రోన్లు పంపడం ద్వారా మరోసారి దాడులకు పాల్పడింది. వాటిలో ఒకటి లాహోర్లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆ దాడిలో నలుగురు సైనికులు గాయపడ్డారు. భారతదేశం ఇలాగే డ్రోన్లను మా గగనతలంలోకి పంపిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు’’ అని ఆయన హెచ్చరించారు.