Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం
ABN , Publish Date - May 04 , 2025 | 08:21 AM
Dr KV Subramaniam: భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వేళ భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్ తరఫున నియమితులైన డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను ఆ పదవి నుంచి తొలగించింది.
న్యూఢిల్లీ, మే 04: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ ఏడాది నవంబర్తో ఆయన పదవి ముగియనుంది. కానీ ఆరు నెలల ముందే.. ఆయన్ని ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఆయనను ఈ పదవి నుంచి తొలగించినట్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్ ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను ఆ పదవి నుంచి ఎందుకు తొలిగించిందనే విషయాన్ని మాత్రం కేంద్రం వెల్లడించక పోవడం గమనార్హం.
2018 నుంచి 2022 వరకు ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం పని చేశారు. ఈ హోదాలో పని చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఇక 2022లో ఐఎంఎఫ్లో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన విధుల్లో చేరారు. నాటి నుంచి మూడేళ్ల పాటు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆరు నెలల ముందే ఆయన్ని ఆ విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్, బంగ్లాదేశ్, బూటాన్, శ్రీలంక దేశాల తరఫున ఆయన ప్రాతినిద్యం వహిస్తారు.
డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం.. ఖరగ్పూర్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. అనంతరం ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్షియల్ ఎకనామిక్స్లో పీహెచ్డీ పట్టా పొందారు. అనంతరం సెబీ, ఆర్బీఐలో పలు నిపుణుల కమిటీలో ఆయన సభ్యుడుగా పని చేశారు.
ఇవి కూడా చదవండి
Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
For National News And Telugu News