IMD: 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:05 PM
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
చెన్నై: రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 3వ వారంలో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలు డిసెంబరు(December) వరకు కొనసాగే అవకాశముందని, వాతావరణంలో ఏర్పడే మార్పులు బట్టి మరో నెల వరకు వీటి ప్రభావం కొనసాగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రెండు, మూడు రోజులు స్థిరంగా కొనసాగి, అనంతరం అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో ఈ సంవత్సరం రాష్ట్రంలో అధిక శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఈ రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడడంతో పాటు ఈదురుగాలుల వేగం కూడా పెరిగే అవకాశముంది.
సహజంగా అక్టోబరు 22వ తేది ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. అయితే, ఈ ఏడాది 16 నుంచి 18వ తేదీల్లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్ సెంథామరై కన్నన్ తెలిపారు. కోస్తా జిల్లాల్లో సుమారు 80 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ఈ రుతుపవనాలతో ఏర్పడే విపత్తులు అడ్డుకొనేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు...
రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 8.30 గంటల గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో తిరువణ్ణామలై జిల్లా పాలారు డ్యాం పరిసరాల్లో 123 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఆర్కాడులో 116 మి.మీ, సెంగంలో 109, కడవనూరు 105, తండరాపట్టు 95, ఆరణి 92, మనప్పాకం 86 మి.మీ వర్షపాతం నమోదైంది. విల్లుపురం జిల్లా సెంబేడు, వాలాజాల్లో 83 మి.మీ, ఆలైపాళయం 81, గుండేరిపల్లం76, కె.పరమత్తి 76, మిన్నల్ 74, నీలగిరి జిల్లా కొడనాడు 73, అరక్కోణం 72, తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి, పళ్లిపట్టుల్లో 70 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News