HR Number Plate Bidder: చిక్కుల్లో ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ బిడ్డర్.. ఏమైందంటే.?
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:34 PM
ఖరీదైన, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ను వేలంలో దక్కించుకున్న హరియాణా వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఆయన ఆదాయం, ఆస్తులపై దర్యాప్తు చేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. ఇక.. ఈ వీఐపీ నంబర్ను మరోసారి వేలంలో ప్రవేశపెడుతున్నట్టు రవాణా శాఖ పేర్కొంది. మరి ఈసారి ఆ ఫ్యాన్సీ నంబర్ను ఎవరు పొందుతారు? ఎంత ధర పలుకుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంటర్నెెట్ డెస్క్: HR 88 B 8888.. దేశంలోనే అత్యంత ఖరీదైన కారు నంబర్ ఇది. దీనిని ఇటీవల హరియాణాకు చెందిన సుధీర్ కుమార్ అనే వ్యక్తి రూ.1.17 కోట్లకు సొంతం చేసుకుని గుర్తింపు పొందాడు. వేలం ద్వారా ఫ్యాన్సీ నంబరైతే దక్కించుకున్నాడు కానీ అంత భారీ మొత్తాన్ని చెల్లించలేక చిక్కుల్లో పడ్డాడు. అసలేం జరిగిందంటే...
రొములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్.. ఇటీవల జరిగిన నంబర్ ప్లేట్ బిడ్డింగ్లో పాల్గొని రూ.కోటి 17 లక్షలకు HR 88 B 8888ను దక్కించుకున్నాడు. అయితే.. ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో హరియాణా ప్రభుత్వం అతని ఆస్తులపై దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్.. సుధీర్ ఆదాయం, ఆస్తులపై విచారణకు ఆదేశించారు. అతడి సెక్యూరిటీ డిపాజిట్గా ఉన్న రూ.11,000ను తక్షణమే జప్తు చేయాలని స్పష్టం చేశారు. సదరు వీఐపీ నంబర్ ప్లేట్ కోసం బిడ్ వేసేందుకు కావాల్సిన నికర మొత్తం అతడి వద్ద ఉందో లేదో తనిఖీ చేయాలని సూచించారు. ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖకు కూడా లేఖ రాస్తానని మంత్రి విజ్ పేర్కొన్నారు.
'ఆర్థిక సామర్థ్యం లేకుండా బిడ్డర్లు ఇష్టానుసారంగా నంబర్ ప్లేట్ల ధరను పెంచకుండా ఉండేందుకు చర్యలు చేపడతాం. దీనికోసం ముందుగానే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాస్తాం. వేలంలో బిడ్డింగ్ వేయడమనేది హాబీ కాదు. దానినో బాధ్యతగా నిర్వర్తించాలి' అని మంత్రి అన్నారు.
మరోసారి వేలంలోకి..
ఈ వీఐపీ నంబర్ ప్లేట్ వేలం పూర్తయ్యాక కావాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు డిసెంబర్ 1 వరకూ గడువు ఉంది. అయితే అప్పటివరకూ సుధీర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. దాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ నగదు చెల్లించేందుకు ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నించానని, కానీ సఫలం కాలేకపోయానని సుధీర్ చెప్పాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల నుంచీ వ్యతిరేకత వచ్చిందన్నాడు. కేవలం నంబర్ ప్లేట్ కోసం అంత మొత్తాన్ని వెచ్చించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారన్నాడు. ఫలితంగా.. సుధీర్ అలాట్మెంట్ను రద్దుచేసి మరోసారి ఆ నంబర్ను వేలంలో ఉంచుతున్నట్టు అక్కడి రవాణా అధికారులు స్పష్టం చేశారు. దీంతో రెండోసారి ఈ నంబర్కు ఎంతమంది ఆసక్తి కనబరుస్తారు. ఎవరు సొంతం చేసుకుంటారు.. ఎంత ధరకు పలుకుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: