Jammu and Kashmir: ఐదు రోజులుగా తప్పిపోయిన సైనికుల మృతదేహాలు లభ్యం
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:46 PM
విపరీతంగా మంచు కురుస్తుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో లాన్స్ హవాల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోయ్ల జాడ గల్లంతైంది. వీరి కోసం గ్రౌండ్ ట్రూప్స్, లోకల్ సపోర్ట్ టీమ్లు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్నాగ్ జిల్లాలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదు రోజుల క్రితం తప్పిపోయిన ఇద్దరు సైనికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో వీరికోసం సైన్యం జరుపుతున్న గాలింపు చర్యలు ముగిసాయి. దక్షిణ కశ్మీర్లోన కోకెర్నాగ్ ఎగువ ప్రాంతంలో ఈ వారం ప్రారంభంలో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సందర్భంగా ఈ ఇద్దరు పారాట్రూపర్లు అదృశ్యమయ్యారు.
విపరీతంగా మంచు కురుస్తుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో లాన్స్ హవాల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోయ్ల జాడ గల్లంతైంది. వీరి కోసం గ్రౌండ్ ట్రూప్స్, లోకల్ సపోర్ట్ టీమ్లు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. డ్రోన్లు, యూఏవీలు, హెలికాప్టర్లను సైతం రంగంలోకి దింపారు. ఎట్టకేలకు శుక్రవారం కోకెర్నాగ్లోని గడోలి ఫారెస్ట్ ఏరియాలో ఒక సైనికుడి మృతదేహం లభించగా, అదే ఫారెస్ట్ ఏరియాలో శనివారంనాడు మరో మృతదేహం లభించింది.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారాట్రూపర్ల అంకితభావం, ధైర్యసాహసాలు అసామాన్యమని, వారి ధైర్యసాహసాలకు తమకు స్ఫూర్తిదాయమని శ్రీనగర్ చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జవాన్ల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ, వారికి అండగా నిలుస్తామని అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం
బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్
Read Latest Telangana News and National News