DGCA - Diwali Rush: పండుగ సీజన్లో టిక్కెట్ ధరలు.. ఎయిర్లైన్స్ను అప్రమత్తం చేసిన డీజీసీఏ
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:03 PM
పండుగ సీజన్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా అదనపు ఫ్లైట్ సర్వీసులను నిర్వహించాలని ఎయిర్లైన్స్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. టిక్కెట్ ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ దీపావళికి విమాన టిక్కెట్ ధరలు విపరీతంగా పెరుగుతాయేమోనని ఆందోళన చెందే వారికి ఓ గుడ్ న్యూస్. ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని వివిధ ఎయిర్లైన్స్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. డిమాండ్కు అనుగుణంగా విమాన సర్వీసులను పెంచాలని చెప్పింది. ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది (DGCA directives airlines).
పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ ధరల విషయంపై తమంతట తాముగా దృష్టిపెట్టామని డీజీసీఏ పేర్కొంది. అధిక టిక్కెట్ ధరల కారణంగా ప్రయాణికులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని చెప్పింది. ప్రధాన రూట్లల్లో టిక్కెట్ ధరలను సమీక్షించామని కూడా తెలిపింది. భారత్ అనుసరిస్తున్న ఓపెన్ ఎయిర్ పాలసీ ప్రకారం, టిక్కెట్ ధరలను నిర్ణయించే హక్కు ఎయిర్లైన్స్కు ఉందని డీజీసీఏ తెలిపింది. అయితే, పండుగ సీజన్లో ప్రయాణికుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది (keep airline fares fair).
డీజీసీఏ నోటీసులపై ఎయిర్లైన్స్ సంస్థలు స్పందించాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో అదనపు ఫ్లైట్లను అందుబాటులోకి తెచ్చినట్టు పలు ప్రధాన ఎయిర్లైన్స్ పేర్కొన్నాయి. దేశీమార్కెట్లో 64.2 శాతం వాటాతో నెం.1గా ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్.. దేశవ్యాప్తంగా 42 సెక్టార్లలో 730 అదనపు ఫ్లైట్లు నిర్వహిస్తామని తెలిపింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా 20 రూట్లల్లో 486 అదనపు ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపాయి. 38 సెక్టార్లలో 546 అదనపు ఫ్లైట్లు నిర్వహించేందుకు స్పైస్ జెట్ ముందుకొచ్చింది. విమాన టిక్కెట్ ధరలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టామని డీజీసీఏ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలిపారు.
దేశీమార్కెట్లో ఇండిగో లీడర్గా కొనసాగుతుండగా ఎయిర్ ఇండియా గ్రూప్ 27.3 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న ఆకాశ ఎయిర్ వాటా 5.4 శాతం. స్పైస్ జెట్ మాత్రం దాదాపు 2 శాతానికి పడిపోయింది. మిగతా చిన్న సంస్థలు మార్కెట్ వాటా మొత్తం కలిపి సుమారు 1 శాతం వరకూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు
డార్జిలింగ్లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి