Illegal Betting Case: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు, కొత్తగా 50.33 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ABN , Publish Date - Oct 10 , 2025 | 09:12 AM
చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం 150 కోట్లకు..
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ మళ్లీ కొరఢా ఝులిపించింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో ప్రజలను మోసం చేసిన కె సి వీరేంద్ర, ఇతరుల కేసులో 2002 PMLA నిబంధనల ప్రకారం ED చర్యలు తీసుకుంటోంది. బెంగళూరులో నిన్న (గురువారం) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో, చల్లకెరె నగరంలోని రెండు లాకర్ల నుండి రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల (సుమారు) బరువున్న 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఇదే కేసుకు సంబంధించి ED దాదాపు 21 కిలోల బంగారు కడ్డీలు, నగదు, బంగారం ఇంకా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి, ఖరీదైన వాహనాల రూపంలో మొత్తంగా రూ. 103 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల విలువ మొత్తంగా రూ. 150 కోట్లకు పైగా ఉంది.

ఇలా ఉండగా ఆగష్టు 23న సిక్కింలోని గ్యాంగ్టక్ లో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, ముంబై, గోవా, సిక్కిం, రాజస్థాన్లోని 31 ప్రదేశాలలో దాడులు ముగించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వీరేంద్రను అరెస్టు చేసింది. అక్రమ ఆన్లైన్ మోసాలు, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద వీరేంద్ర, అతని సహాయకుల మీద కేసులు నమోదు చేశారు. మరో క్యాసినో పెట్టేందుకు భూమి లీజుకు సంబంధించి వీరేంద్ర గ్యాంగ్టక్లో వ్యాపార పర్యటనలో ఉండగా ED అదుపులోకి తీసుకుంది.
కేసి వీరేంద్రను సిక్కింలోని గ్యాంగ్టాక్లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం బెంగళూరులోని న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఈ కేసులో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలతో పాటు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. వాటిలో మూడు ఆఫ్షోర్ కంపెనీలకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ ఈడీ రూ.12 కోట్ల నగదు, రూ. 1 కోటి విదేశీ కరెన్సీ, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుంది. మొత్తం 17 బ్యాంకు ఖాతాలు, 2 బ్యాంకు లాకర్లను సీజ్ చేసింది.

వీటితో పాటు, వీరేంద్ర నుంచి ఐదు అంతర్జాతీయ క్యాసినో సభ్యత్వ కార్డులు, మూడు లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు, వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా ED స్వాధీనం చేసుకుంది.
వీరేంద్ర కింగ్567, రాజా567 మొదలైన పేర్లతో అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వీరేంద్ర నడుపుతున్నాడని ED పేర్కొంది. వీరేంద్ర సోదరుడు కె.సి. తిప్పేస్వామి, మేనల్లుడు పృథ్వీ ఎన్. రాజ్ దుబాయ్ నుండి డైమండ్ సాఫ్ట్టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ అనే మూడు వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. ఇవి వీరేంద్ర కాల్ సెంటర్ సేవలు, గేమింగ్ వ్యాపారానికి సంబంధించినవి.

ఈ క్రమంలో వీరేంద్ర, తిప్పేస్వామి, కె.సి. నాగరాజ్ ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. వీరిలో కె.సి. నాగరాజ్ కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్. వారి ఇళ్లనుంచి నుంచి ఆస్తులకి సంబంధించిన అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరేంద నడుపుతున్న గోవాలోని ఐదు క్యాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది. పార్లమెంటు ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ఆమోదించిన కొన్ని రోజుల తర్వాత ఈ దాడులు జరిగాయి.
2016లో, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులకు చెల్లకెరెలోని వీరేంద్ర ఇంటి బాత్రూంలోని ఒక రహస్య గదిలో ఆదాయపు పన్ను శాఖ రూ. 5.7 కోట్ల నగదును, అన్నీ కొత్త రూ.2,000 నోట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత, వీరేంద్రను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతను 2023లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి కర్ణాటకలోని చిత్రదుర్గ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఇవి కూడా చదవండి
జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం
మధ్యంతర ఉత్తర్వులు వెబ్సైట్లో పెట్టండి
Updated Date - Oct 10 , 2025 | 07:44 AM