Share News

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Feb 16 , 2025 | 07:27 AM

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య
Delhi Stampede Incident..

న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ (Delhi railway station) తొక్కిసలాట (Stampede) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 18కి (Death toll rises18) చేరింది. పలువురు క్షతగాత్రులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. కాగా ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది చనిపోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో 14, 15 ప్లాట్‌ ఫామ్‌ నెంబర్ల వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ వార్త కూడా చదవండి..

బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి


వివరాలు..

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో 15 మంది మరణించారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దాదాపు 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాగరాజ్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన 15–20 నిమిషాల్లోనే భారీగా ప్రయాణికులు ప్లాట్‌ఫాం 14, 15పైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా రైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ తొలుత ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, వదంతులను నమ్మొద్దని ప్రకటించింది. తర్వాత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రైల్వే స్టేషన్‌కు చేరుకొన్నాయి. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటలో మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. కాగా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందిస్తూ.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రెండు రైళ్లు ఆలస్యంగా రావడం, 15–20 నిమిషాల్లోనే ప్రయాణికులు పెద్దఎత్తున ప్లాట్‌ఫాంపైకి తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.


ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 15 మంది మరణించడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఇంకా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. కుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాలో భాగంగా ఇప్పటివరకు 50 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, మహాకుంభమేళాలో శనివారం మరో అగ్ని ప్రమాదం జరిగింది. పలు టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికేమీ కాలేదు. ప్రయాగ్‌రాజ్‌–మిర్జాపూర్‌ జాతీయ రహదారిపై భక్తులు ప్రయాణిస్తున్న బస్సు–బొలెరో వాహనం ఢీకొని పది మంది చనిపోయారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించాయి. తొక్కిసలాటలో మరణాలపై ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తునకు ఆదేశించింది.


దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఎల్ఎన్ జేపీ హాస్పటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అబ్బురపరిచే అద్భుత లోకం

గొంతు కోసినా.. మేకులా బతికింది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 16 , 2025 | 07:40 AM