Chennai News: హీరోయిన్ బరువును ప్రశ్నించిన యూట్యూబర్..
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:23 PM
హీరోయిన్ను ‘మీ బరువెంత?’ అంటూ ఓ ట్యూబర్ వేసిన ప్రశ్న కోలీవుడ్లో తీవ్ర వివాదం రేపుతోంది. అతనిపై ఆ హీరోయిన్తో పాటు పలువురు నటీనటులు, పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘అదర్స్’ చిత్ర ప్రెస్మీట్లో ఓ యూట్యూబర్.. హీరోయిన్ గౌరీ కిషన్ బరువు గురించి అడిగాడు.
- నటి గౌరీ కిషన్ ఆగ్రహం... అండగా సినీ, పాత్రికేయ సంఘాలు
చెన్నై: హీరోయిన్ను ‘మీ బరువెంత?’ అంటూ ఓ ట్యూబర్ వేసిన ప్రశ్న కోలీవుడ్లో తీవ్ర వివాదం రేపుతోంది. అతనిపై ఆ హీరోయిన్తో పాటు పలువురు నటీనటులు, పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల చెన్నై(Chennai)లో జరిగిన ‘అదర్స్’ చిత్ర ప్రెస్మీట్లో ఓ యూట్యూబర్.. హీరోయిన్ గౌరీ కిషన్ బరువు గురించి అడిగాడు. దీనిపట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా బరువు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తోందా? అది సినిమాకు ఎలా ముఖ్యమవుతుంది? నా బరువు నా ఇష్టం. అది సినిమాకు గానీ, నా ప్రతిభకు గానీ సంబంధించిన విషయం కాదు.
ఇది బాడీ షేమింగ్ తప్ప మరొకటి కాదు. సినిమా ప్రెస్మీట్లో ఇంతకంటే తెలివితక్కువ ప్రశ్న మరొకటి లేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆగ్రహం సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతోంది. దీని గురించి ఆ చిత్ర హీరో ఆదిత్య మాధవన్ మాట్లాడుతూ.. ఆ యూట్యూబర్ ప్రశ్నతో నేను స్తంభించిపోయాను. చాలా ఆశ్చర్యం గొలిపింది. అందుకే వెంటనే నేను స్పందించలేకపోయాను’ అంటూ ఎక్స్లో వివరణ ఇచ్చారు. కాగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించింది.

జర్నలిజం ముసుగులో వున్న కొంతమంది వక్రబుద్ధి గల వ్యక్తులు ప్రెస్ సమావేశాల్లో నటీమణులను ఎగతాళి చేయడం, అవమానించడం, ఆందోళనకరం అని పేర్కొంది. నటి గౌరీ కిషన్ బాధను తాము అర్థం చేసుకుంటున్నామని, ఓ మనిషి ఆకారాన్ని విమర్శిస్తే మానసికంగా బాధ కలుగుతుందని, ఇలాంటి బాడీ షేమింగ్ చర్యలకు పాల్పడేవారిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. సీనియర్ నటి ఖుష్బూ కూడా నటి గౌరీ కిషన్కు గట్టి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా చెన్నై ప్రెస్ క్లబ్ కూడా నటి గౌరీ కిషన్కు మద్దతుగా, అవమానకరమైన ప్రశ్న వేసిన యూట్యూబర్ ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News