Pahalgam Terror Attack: బిడ్డ కోసం వదిలిపెట్టమన్నా వినలేదు.. పహెల్గామ్ మృతుడి భార్య కన్నీరు
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:09 PM
పహెల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాత తాజాగా మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. బిడ్డ కోసం వదిలిపెట్టమని వేడుకున్నా కూడా ఉగ్రవాదులు తన భర్తను తలకు గురిపెట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పహెల్గామ్లో ఉగ్రవాదులు తలపెట్టిన మారణహోమంలో తన భర్తను పోగొట్టుకున్న డా. సుజాతా భూషణ్ కన్నీటి పర్యంతమయ్యారు. బిడ్డకోసమైనా తనను వదిలిపెట్టమని తన భర్త వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదని అన్నారు. భర్త భూషన్, ఆయన భార్య సుజాత భూషణ్ వారి మూడేళ్ల బిడ్డ బైసారన్ మైదానంలో సరదాగా టూర్ను ఎంజాయ్ చేస్తుండగా మంగళవారం ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
ఆ ఘటన గురించి డా.సుజాత భూషణ్ మీడియాతో పంచుకున్నారు. ఏప్రిల్ 18న తాము పర్యటన కోసం వెళ్లామని తెలిపారు. పహెల్గామ్ తమ చివరి స్టాప్ అని అన్నారు. బైసారన్ ప్రాంతంలో గుర్రపు స్వారీ కోసమని వెళ్లినట్టు వివరించారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల వేళ ఉగ్రమూకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయని అన్నారు.
తొలుత చప్పుళ్లు వినిపించగానే తాము ఏదో శబ్దం అని అనుకున్నామని, కానీ ఆ శబ్దాలు ఆగకుండా వస్తుంటే అప్పుడు సందేహం కలిగిందని అన్నారు. బైసారన్ ప్రాంతం అంతా సువిశాలంగా, ఉగ్రవాదుల కళ్లగప్పి పారిపోలేని విధంగా ఉందని పేర్కొన్నారు. దీంతో, ఏం చేయాలో తోచక తాము సమీపంలోని ఓ టెంట్లో దాక్కున్నామని చెప్పారు. చుట్టుపక్కల ఏం జరుగుతోందో తమకు స్పష్టంగా కనిపించిందని చెపప్పారు. ‘‘ఓ ఉగ్రవాది మాకు 100 మీటర్ల దూరంలో ఉన్న టెంట్లోకి వెళ్లాడు. ఓ పురుషుడిని బయటకు లాక్కొచ్చి ఏదో మాట్లాడాడు.. ఆ తరువాత తలపై గురిపెట్టి కాల్చి చంపేశాడు. అలా మరో ఇద్దరిని చంపేశాడు. వారితో ఏం మాట్లాడాడో మాకు వినిపించలేదు. ఇంతలో మా టెంట్ పక్కనే ఎవరో.. మా బిడ్డలు అలమటిస్తుంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు’ అని ఎవరో అనడం వినిపించింది. మీరు వార్తలు చూడట్లేదా అంటూ ఓ వృద్ధుడిని ప్రశ్నించి ఆపై నిర్దాక్షిణ్యంగా చంపేశాడు’’
‘‘ఆ తరువాత ఓ ఉగ్రవాది మా టెంట్ వద్దకు వచ్చాడు. ఏ మాటా మాట్లాడకుండా నా భర్తను కాల్చి చంపేశాడు. బిడ్డను చూసైనా తనను వదిలిపెట్టమని నా భర్త వేడుకున్నారు. కానీ ఉగ్రవాది తనను కాల్చి వెళ్లిపోయాడు’’ అని సుజాత తెలిపారు. మరోవైపు, ఈ దారుణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
భారత్లో పాక్ ట్విట్టర్ అకౌంట్పై వేటు
పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం
న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు