Bengaluru News: పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయితీ..
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:04 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన బంగారం బిస్కెట్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా.. మొత్తం రూ. 88 కోట్ల వరకు చెల్లించాలని తేల్చినప్పటికీ మొత్తం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
- బళ్లారిలో పెరుగుతున్న సాయి జ్యువెల్లర్స్ బాధితులు
- ఇప్పటికి తేలింది రూ.88 కోట్లు
బళ్లారి(బెంగళూరు): బళ్లారిలో సాయి కమల్ జ్యువెలర్స్లో బంగారం బిస్కట్ల బాధితులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. యజమాని జగదీష్ గుప్త చేసిన మోసం పంచాయితీ పెద్దల వద్దకు చేరింది. ఇప్పటికి రూ. 88 కోట్ల వరకు చెల్లించాలని లెక్కలు తేల్చారు. పోలీస్ వర్గాలు, బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. సోమవారం బళ్లారి(Ballary)లోని జిల్లా కలెక్టర్ బంగ్లా కాంపౌండ్ వాల్ పక్కన ఉన్న జగధీష్ గుప్త ఇంట్లో బంగారు పంచాయితీ జరిగింది. మొత్తం కస్టమర్లకు రూ.88 కోట్లు చెల్లించాలని పెద్దలు లెక్క తేల్చారు. ఇందులో ఎవరి బంగారం ఎంత, ఎవరి వెండి ఎంత అనేది తేల్చారు.
100 మంది వరకు బాధితుల పేర్లను చదివి వినిపించారు. ఇందులో 15 శాతం ఇచ్చేందుకు తీర్మానించారు. అంటే రూ.88 కోట్ల విలువైన బంగారానికి ఆయన 15శాతం అంటే కేవలం రూ.8కోట్ల 88 లక్షలు పై చిలుకు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అందుకు ఆయన వద్ద ఉండే బంగారం, వెండి లెక్కవేసి ఉన్న ఇళ్లు, అలాగే దుకాణం రెండు లెక్కేస్తే మొత్తం రూ.16 కోట్లు విలువ లెక్కేశారు. కొందరికి 15 శాతం ప్రకారం లెక్క వేసి బంగారం ఇచ్చారు. దీనికి కొందరు వచ్చినంత రానిలే అని తీసుకోగా కొందరు తిరస్కరించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి(Kalyanadurgam) చెందిన ఒక వ్యక్తి జగధీష్ గుప్తాను నమ్మి చాలా కాలంగా బంగారం ఆయన వద్ద ఉంచారు.
భద్రంగా ఉంటుందని ఉంచితే ఇలా మోసానికి పాల్పడతావా అని బాధితుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. బంగారం దాచిపెట్టుకుని ఇలా మోసం చేస్తావా అని మరొకరు వాపోయారు. ఓ ఉద్యోగి తన కూతురు వివాహానికి వారం క్రితం బంగారు కొనుగోలుకు రూ. 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నగలు చేయించారు. ఆభరణాలు అప్పగించకుండా వెళ్లిపోయాడు అని అతను వాపోయారు. బళ్లారిలో ఉండే ఇద్దరు పెద్ద వ్యాపారులు పురాతన కాలంలో వారి తాతలు కాలం నాటి బంగారాన్ని ఇక్కడే ఉంచారు. భద్రంగా ఉంటుందని ఉంచామని, ఇంత మోసం చేస్తారని అనుకోలేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.

ఈ పంచాయతీ ఎమ్మెల్యేలు, పోలీసులు వద్దకు చేరింది. వారికి తెలిన వారు జరిగిన వాటిపై నాయకులతో చెప్పి తమ బంగారం ఇప్పించాలని వేడుకుంటున్నారు. బాధితుల్లో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఈనెల 5న ఆంధ్రజ్యోతిలో బళ్లారిలో ‘సాయి కమల్ జువెలర్స్ వ్యాపారి పరార్’ అనే వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలలు తరువాత వ్యాపారి వచ్చి సెటిల్ మెంట్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!
Read Latest Telangana News and National News