ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం!
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:08 AM
దేశ సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థత మనకుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.
ఉత్తర భారతంలోని సరిహద్దుల్లో పరిస్థితి సాధారణమే: ఆర్మీ చీఫ్
పుణెలో ఘనంగా 77వ ఆర్మీ డే
పుణె, జనవరి 15: దేశ సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థత మనకుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఉత్తర భారతంలోని సరిహద్దుల్లో పరిస్థితి సున్నితమైనప్పటికీ ప్రస్తుతం సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. పుణెలోని ఆర్మీ సదరన్ కమాండ్కు చెందిన బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్లో బుధవారం ఆర్మీ డే పరేడ్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో ద్వివేది మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందని, అయితే చొరబాటు ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఆర్మీ డే వేడుకలను తొలిసారి పుణెలో నిర్వహిస్తున్నామని, ఇది కూడా ప్రాముఖ్యత కలిగిన అంశమని, ఇకపై చిన్న నగరాల్లో వేడుకలను నిర్వహిస్తామన్నారు.
వీర జవాన్కు గ్యాలంటరీ అవార్డు
సిరిసిల్ల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మృతిచెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన జవాన్ అనిల్కుమార్(30)కు కేంద్రం ప్రకటించిన గ్యాలంటరీ అవార్డును ఆయన సతీమణి సౌజన్యకు అందజేశారు. పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. 2023 మే 4న జమ్మూకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ మృతి చెందారు.