Dharmasthala Excavation: ధర్మస్థలలో 100 ఎముకలు లభ్యం
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:56 AM
కర్ణాటకలోని ధర్మస్థలలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాలలో
బెంగళూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ధర్మస్థలలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాలలో ఇప్పటి వరకు 100 ఎముకలు లభ్యమయ్యాయి. మరో 3 అస్థిపంజరాలు లభ్యమయ్యాయనే ప్రచారాన్ని సిట్ తోసిపుచ్చింది. ఫిర్యాదుదారు చూపించిన 13 ప్రదేశాలకుగాను ఇప్పటి వరకు 12 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. బుధవారం 13వ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టనున్నారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లోనూ తవ్వకాలకు సిద్ధంగా ఉన్నామని సిట్ వర్గాలు తెలిపాయి. 6వ ప్రదేశంలోనూ, 11వ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోని 11-ఏ ప్రదేశంలోనూ ఎముకలు లభించాయి. ఆ ఎముకలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. 11వ ప్రదేశంలో కాకుండా బంగ్లగుడ్డపై తవ్వకాలు జరపాలని ఫిర్యాదుదారు కోరిన నేపథ్యంలో సోమవారం అక్కడ(11-ఏ) జరిపిన తవ్వకాలలో ఒక అస్థిపంజరం లభించింది. అయితే, 11-ఏ ప్రదేశంలో కనీసం మూడు అస్థిపంజరాలు లభించాయని బాధితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. వాటిలో ఒకటి మహిళదని, అక్కడ చీర కూడా లభ్యమైందని చెప్పారు. అయితే, దీన్ని పోలీసులు తోసిపుచ్చారు.