Rajnath-Australia: కీలక ఆస్ట్రేలియన్ నేవీ స్థావరం సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:22 AM
కీలకమైన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ స్థావరాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అంతకుముందు, సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో ఇరు దేశాలు..
సిడ్నీ (ఆస్ట్రేలియా), అక్టోబర్ 10: సిడ్నీలోని పాట్స్ పాయింట్లో ఉన్న కీలకమైన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (RAN) స్థావరం అయిన HMAS కుట్టాబుల్ను భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఆయనకు ఆస్ట్రేలియా రక్షణశాఖ సహాయ మంత్రి పీటర్ ఖలీల్ స్వాగతం పలికారు. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ సామర్థ్యాలు, మౌలిక సదుపాయాల గురించి భారత రక్షణ మంత్రికి ఖలీల్ వివరించారు.
HMAS కుట్టాబుల్ ఆస్ట్రేలియా తూర్పు తీరంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ప్రధాన స్థావరం. ఇది ఆ దేశ నావికా సిబ్బందికి ముఖ్యమైన పరిపాలనా, శిక్షణ, లాజిస్టిక్స్, వసతి కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఆస్ట్రేలియా బలమైన సముద్ర సంసిద్ధత, వ్యూహాత్మక కార్యాచరణను సూచిస్తుంది.
రెండు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న (గురువారం)ఉదయం, సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఉప ప్రధాని, ఆ దేశ రక్షణ మంత్రి అయిన రిచర్డ్ మార్లెస్తో రాజ్నాథ్ సుధీర్ఘ చర్చలు జరిపారు.
ఈ సమావేశం భారత, ఆస్ట్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిభింబించింది. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సముద్ర, వాయు, భూమి, సైబర్, అంతరిక్షం.. ఇలా అన్ని రంగాలలో ఇరు దేశాల పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలనే దృఢ సంకల్పాన్ని ఇద్దరు మంత్రులు నొక్కిచెప్పారు.
ఇవి కూడా చదవండి
జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం
మధ్యంతర ఉత్తర్వులు వెబ్సైట్లో పెట్టండి
Updated Date - Oct 10 , 2025 | 07:44 AM