Pakistan Train Hijack: 214 మంది బందీలను చంపేశాం.. బలూచ్ మిలిటెంట్లు సంచలన ప్రకటన
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:51 PM
పాకిస్థాన్ బలగాలకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ లెక్కచేయకపోవడంతో 214 మంది బందీలను హతమార్చినట్టు బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని జఫర్ ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి తాము చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైందని పాక్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సంచలన ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మందిని హతమార్చినట్టు బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ బలగాలకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ లెక్కచేయకపోవడంతో 214 మంది బందీలను హతమార్చినట్టు ఆయన తెలిపారు.
Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..
''యుద్ధ ఖైదీలను విడిచిపెట్టాలని పాకిస్థాన్ ఆర్మీకి 48 గంటల సమయం ఇచ్చాం. బందీలుగా ఉన్న వారిని రక్షించేందుకు చిట్ట చివరి అవకాశం ఇచ్చాం. కానీ పాక్ మొండితనం, సైనిక దురహంకారం ప్రదర్శించింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని హతమార్చాం" ఆని బీఎల్ఏ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే బీఎల్ఏ ఎప్పుడూ వ్యవహరించిందని, పాకిస్థాన్ సైన్యం మాత్రం బందీలను విడిచించేందుకు బదులు తమను చంపే ప్రయత్నం చేసిందని తప్పుపట్టింది. బందీలను చంపినట్టు ప్రకటించిన బీఎల్ఏ ఇందుకు సంబంధించిన ఎలాంటి సాక్షాలను విడుదల చేయలేదు.
బీఎల్ఏ ప్రకటనపై పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. తాము చేపట్టిన మిలటరీ ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లను హతమార్చామని, 354 మంది బందీలను రక్షించామని చెప్పారు. బీఎల్ఏ బందీలను పట్టుకుపోయిదనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. బందీల సంఖ్యను హెచ్చుచేసి చూపిస్తోందంటూ బీఎల్ఏను విమర్శించారు. బలూచ్ వేర్పాటువాదులు రైలును హైజాక్ చేయడంతో వెంటనే ఆర్మీ ఆపరేషన్ చేపట్టామని, ఈ దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులతో సహా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పాయారని తెలిపారు. బలోచ్ మిలిటెంట్ల వెనుక ఇండియా, ఆప్ఘనిస్థాన్ ఉన్నట్టు షరీప్ చౌదరి ఆరోపించారు. అయితే ఆ ఆరోపణను ఇండియా, ఆప్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండించాయి. సొంత ఇల్లు చక్కబెట్టుకోలేక ఇతరులపై వేలెత్తి చూపడం పాక్కు అలవాటుగా మారిందంటూ దుయ్యబట్టాయి.
ఇవి కూడా చదవండి..
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..
NASA Crew 10 Mission: నాసా క్రూ-10 మిషన్ ప్రారంభం.. త్వరలో భూమ్మీదకు చేరనున్న సునీతా విలియమ్స్
Read Latest and International News