Shubhanshu Shukla: అంతరిక్షం చేరుకుని అనుభవాలను పంచుకున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:13 PM
39 ఏళ్ల భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) భారత్ తరఫున అంతరిక్షం చేరుకుని అరుదైన రికార్డ్ సాధించారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (39) (Shubhanshu Shukla) అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆక్సియం-4 మిషన్లో భాగంగా ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆయన ISS చేరుకున్నారు. ఈ క్రమంలో అంతరిక్షంలోకి చేరిన కొన్ని గంటల్లోనే శుభాన్షు తన మొదటి సందేశాన్ని పంపించారు. 'హాయ్ అందరికీ అంతరిక్షం నుంచి నమస్కారం. నా సహచర అంతరిక్ష యాత్రికులతో కలిసి ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది. ఓహో, ఏమి యాత్ర ఇది. లాంచ్ప్యాడ్పై క్యాప్సూల్లో కూర్చొన్న తర్వాత రాకెట్ ఎగిరినప్పుడు, సీట్లోకి నెట్టబడ్డ అనుభూతి అద్భుతం. అకస్మాత్తుగా శూన్యంలో తేలియాడుతున్నట్లు అనిపించిందని ఆయన ఆనందాన్ని పంచుకున్నారు.
తొలి అనుభవాలు
అంతరిక్షంలో మైక్రో గ్రావిటీ అనుభవం గురించి శుభాన్షు ఆసక్తికరంగా వెల్లడించారు. శూన్యంలో ఎగిరినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించిందన్నారు. కానీ, ఇప్పుడు బాగా నిద్రపోతున్నానని చెప్పారు. ఇక్కడ నడవడం, తినడం వంటి విషయాలు నేర్చుకోవడం ఒక చిన్న పిల్లవాడిలా అనిపిస్తోందని తన అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షంలో తేలియాడుతూ, భూమిపై సాధారణమైన పనులు కూడా ఇక్కడ ఒక సాహసంలా మారిన అనుభవం ఆశ్చర్యపరిచిందన్నారు.
ఈ మిషన్లో సహచరులు
శుభాన్షు ఈ మిషన్లో ముగ్గురు ఇతర అంతరిక్ష యాత్రికులతో కలిసి ఉన్నారు. కమాండర్ పెగ్గీ విట్సన్, నాసా మాజీ అంతరిక్ష యాత్రికురాలు, మూడు మిషన్ల అనుభవజ్ఞురాలు. హంగరీకి చెందిన టిబోర్ కపు, పోలాండ్కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు. ఈ నలుగురూ కలిసి ISSలో వివిధ ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ లాంచ్ను శుభాన్షు కుటుంబం, భారత్, హంగరీ, పోలాండ్, అమెరికా ప్రాంతాల్లో అనేక మంది ప్రత్యక్షంగా వీక్షించారు.
భారత్కు రెండో అంతరిక్ష యాత్రికుడు
శుభాన్షు శుక్లా భారత్కు రెండో అంతరిక్ష యాత్రికుడు కాగా, ISSకు చేరిన తొలి భారతీయుడు. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇండో సోవియట్ మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు, 41 ఏళ్ల తర్వాత, శుభాన్షు ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ మిషన్ మొదట మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణ సమస్యలు, డ్రాగన్ క్యాప్సూల్లో సాంకేతిక సమస్యల కారణంగా అనేకసార్లు వాయిదా పడింది. నాసా, స్పేస్ఎక్స్, ఆక్సియం బృందాలు దాదాపు ఒక నెల పాటు సమస్యలను పరిష్కరించి, చివరకు జూన్ 25, 2025న ఈ విజయవంతమైన లాంచ్ చేశాయి.
ఇవీ చదవండి:
భారత్, ఇంగ్లాడ్ టెస్ట్ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..
భారీ వర్షాలు.. ఇద్దరి మృతి, 20 మంది గల్లంతు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి