Woman Shot In Armed Robbery: తప్పించుకోవాలనుకుంది.. వెంటాడి మరీ కాల్చి చంపాడు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:36 AM
ఆ దొంగ కిరణ్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలో దిగబడ్డంతో ఆమె నేలపై కుప్పకూలిపోయింది. దొంగ షాపులో డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.
అమెరికాలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ దొంగ భారతీయ మహిళను వెంటాడి మరీ కాల్చి చంపాడు. మహిళకు చెందిన షాపులో దొంగతనానికి వచ్చిన ఆ దొంగ ఈ దారుణానికి ఒడిగట్టాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాలోని గుజరాత్కు చెందిన కిరణ్ పాటిల్ చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని యూనియన్ కౌంటీలో సెటిల్ అయింది. అక్కడి పిక్నీ స్ట్రీట్లో ఓ ఫుడ్ స్టోర్ నిర్వహిస్తోంది.
మంగళవారం రాత్రి షాపు క్లోజ్ చేసే సమయంలో ఓ దొంగ తుపాకితో షాపులోకి చొరబడ్డాడు. ఆ తుపాకితో కిరణ్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే, దొంగ చేతిలో తుపాకి చూసి కిరణ్ భయపడిపోయింది. ఓ వస్తువుతో అతడిపై దాడి చేసింది. ఆ వెంటనే అక్కడినుంచి బయటకు పరుగులు తీసింది. దొంగ కోపం కట్టలు తెంచుకుంది. ఆమెను వెంబడించాడు. కిరణ్ డోరు తీసుకుని పార్కింగ్ ప్లేస్లోకి వచ్చింది. చీకట్లోకి పరుగులు తీయబోయింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.
ఆ దొంగ కిరణ్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలో దిగబడ్డంతో ఆమె నేలపై కుప్పకూలిపోయింది. దొంగ షాపులో డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగ కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి
పది లక్షల డాలర్లకు ట్రంప్ గోల్డ్ కార్డు