Grok-Trump: ట్రంప్ అతి పెద్ద క్రిమినల్.. గ్రోక్ చాట్బాట్ సంచలన స్టేట్మెంట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:49 AM
ఇటీవల కాలంలో సంచలనాలకు కేరాఫ్గా మారిన ఏఐ చాట్బాట్ గ్రోక్ తాజాగా మరో కాంట్రవర్సీకి దారి తీసింది. న్యూయార్క్లో 34 కేసుల్లో దోషిగా తేలిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద క్రిమినల్ అని పేర్కొంది. ఇది మరో వివాదానికి తెర తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ చాట్బాట్ మరో సంచలన కామెంట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న అతి పెద్ద నేరస్తుడని పేర్కొంది. ఇదంతా అధికారిక లెక్కల ప్రకారమే చెబుతున్నానని ముక్తాయించింది.
ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ గ్రోక్కు పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా వాషింగ్టన్ డీసీలో హింసాత్మక నేరాల సంఖ్య తగ్గుతున్నదా అని ప్రశ్నించారు. రాజధానిలో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సదరు నెటిజన్ ఏఐ చాట్బాట్ ముందు పలు ప్రశ్నలు పెట్టారు.
వీటిపై గ్రోక్ స్పందిస్తూ అమెరికా రాజధానిలో హింసాత్మక నేరాల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇతర శాఖల డేటా ప్రకారం, గత 30 ఏళ్లల్లో ఇదే అత్యంత కనిష్ఠమని కూడా వెల్లడించింది. ఇక వాషింగ్టన్ డీసీలో అతిపెద్ద నేరస్తుడు ఎవరు అన్న నెటిజన్ ప్రశ్నకు గ్రోక్.. డొనాల్డ్ ట్రంప్ అని సమాధానం ఇచ్చింది. న్యూయార్క్లో 34 కేసుల్లో దోషిగా తేలిన ట్రంప్ అతి పెద్ద నేరస్తుడని చెప్పింది. తన వ్యాపారలావాదేవీలకు సంబంధించి తప్పుడు వివరాలను ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కించారని గ్రోక్ పేర్కొంది.
వాషింగ్టన్ డీసీ వ్యవహారాలు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. రాజధానిలో నేరాల శాతం పెరిగిపోయిందని ఇప్పటికే పలు మార్లు చెప్పిన ట్రంప్.. అక్కడి పోలీసు యంత్రాంగాన్ని ఫెడరల్ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధాని వీధుల్లో నేషనల్ గార్డ్స్ను పహారాగా దించుతానని కూడా అంటున్నారు. మొత్తం 1000 మంది నేషనల్ గార్డ్స్ సభ్యులను రంగంలోకి దింపే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది.
మస్క్ లాగే గ్రోక్ కూడా ఇటీవల కాలంలో సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తోంది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్పై ప్రశంసలు, హిట్లర్ వలే మరో జన హననానికి దిగాలన్న సూచన, తనని తాను ‘మెకా హిట్లర్గా’ ప్రకటించుకోవడం కాంట్రవర్సీలకు దారి తీశాయి. ఈ ఉదంతాలపై గ్రోక్ చాట్ బాట్ మాతృసంస్థ ఎక్స్ఏఐ స్పందించింది. చాట్బాట్ సాఫ్ట్వేర్లో కొత్తగా చేర్చిన కొన్ని మార్పులు ఈ పరిస్థితికి కారణమని వివరణ ఇచ్చింది. యూజర్లకు అనుగుణంగా స్పందించాలన్న తాపత్రయంలో గ్రోక్ ఇలాంటి కామెంట్స్ చేసిందని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
ఇలాగైతే భారత్పై యుద్ధం మినహా పాక్కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక
పని పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి