Bilaval Bhutto: నిన్న రక్తపాతం, నేడు శాంతి వచనాలు.. బిలావల్ భుట్టో తీరిది
ABN , Publish Date - May 06 , 2025 | 06:53 PM
శాంతి మార్గంలో నడవాలని భారత్ కోరుకుంటే పిడికిలి బిగించి కాకుండా నిండు మనసుతో ముందుకు రావాలని, అభూతకల్పనలతో కాకుండా వాస్తవాలతో రావాలని బిలావల్ భుట్టో అన్నారు. అప్పుడు ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి కూర్చుని నిజం ఏమిటో మాట్లాడుకుందామని పేర్కొన్నారు.
ఇస్లామాబాద్: సింధు నదీ జలాలను నిలిపివేస్తే రక్తం పారుతుందంటూ ఇటీవల భారత్పై తెగబడుతూ వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ (Bilawal Bhutto-Zardari) మంగళవారంనాడు వెనక్కి తగ్గారు. 'శాంతి' వచనాలు పలికారు. భారత్తో శాంతికి పాక్ సిద్ధమేనని అన్నారు.
Pakistan: రక్షణ రంగం బడ్జెట్ 18 శాతం పెంచిన పాక్
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో బిలావల్ భుట్టో మంగళవారంనాడు మాట్లాడుతూ... ''శాంతి మార్గంలో నడవాలని భారత్ కోరుకుంటే పిడికిలి బిగించి కాకుండా నిండు మనసుతో ముందుకు రావాలి. అభూతకల్పనలతో కాకుండా వాస్తవాలతో రావాలి. ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి కూర్చిని నిజం ఏమిటో మాట్లాడుకుందాం'' అని అన్నారు.
మోకరిల్లం...
పాక్తో శాంతిని కోరుకునేందుకు భారత్ ముందుకు రాకుంటే పాకిస్థాన్ ప్రజలు మోకరిల్లేది లేదని, పోరాటానికే కృతనిశ్చయిలవుతారని చెప్పారు. పాక్ శాంతిని కోరుకుంటుందని, ఎందుకంటే తాము స్వే్చ్ఛను నమ్ముతామని అన్నారు. దీనికి ముందు ఏప్రిల్ 25న జర్దారి మాట్లాడుతూ, సింధు నది దురాక్రమణకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్పడితే పాకిస్థాన్ ఐక్యంగా నిలబడి గట్టి జవాబిస్తుందన్నారు. నదీజలాలను ఆపితే సింధు జలాల్లో రక్తం పారుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో బిలావల్ వెనక్కి తగ్గారు. అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలు కావని, పాక్ ప్రజల మనోభావాలు ఆవిధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బిలావల్ సోషల్ మీడియా అకౌండ్ను భారత్లో సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..