Share News

Charlie Kirks Assassination: కిర్క్ హత్యలో కార్ల్ మార్క్స్ ప్రమేయం

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:40 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసపుత్రుడైన చార్లీ కిర్క్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఉథా వ్యాలీ యూనివర్సిటీలో సెప్టెంబరు 11న నిర్వహించిన ‘ద అమెరికన్ కమ్‌బ్యాక్ టూర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కిర్క్‌ను కాలేజీ విద్యార్థి ఒకడు తుపాకీతో...

Charlie Kirks Assassination: కిర్క్ హత్యలో కార్ల్ మార్క్స్ ప్రమేయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసపుత్రుడైన చార్లీ కిర్క్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఉథా వ్యాలీ యూనివర్సిటీలో సెప్టెంబరు 11న నిర్వహించిన ‘ద అమెరికన్ కమ్‌బ్యాక్ టూర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కిర్క్‌ను కాలేజీ విద్యార్థి ఒకడు తుపాకీతో కాల్చి చంపేశాడు. కిర్క్‌ 32 ఏళ్ల యువకుడు. అయితే ఛాందసుడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనే బాపతు!

అమెరికా కళాశాలల్లో అల్లరిమూకలు కాల్పులు జరిపిన వార్తలు తరచూ వింటుంటాం. ఇది అలాంటి హత్య కాదు. అమెరికన్లేగాక ఈ వార్త తెలిసిన వారంతా దీన్ని ఒకానొక హత్యా సంఘటనగా తేలిగ్గా తీసిపడేయడం లేదు. దాన్నొక భిన్న సైద్ధాంతిక శిబిరాల ఘర్షణగా చూస్తున్నారు. వివిధ దేశాలపై, వివిధ సమూహాలపై ట్రంప్ అనుసరిస్తున్న కక్షసాధింపు విధానాల మీద జరుగబోయే ప్రతిచర్యలకు ఇదొక మచ్చుతునక అంటున్నారు. ఇది ఇంతటితో ఆగదని కూడ కొందరు అంటున్నారు. చార్లీ కిర్క్ మీద కాల్పులు జరిపిన విద్యార్థిని పోలీసులు గుర్తించారు, అరెస్టు చేశారు. అతని పేరు టేలర్ రాబిన్‌సన్. 22 ఏళ్ల యువకుడు. హంతకుడ్ని చూసి ఉథా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ షాక్‌కు గురయ్యాడు. రాబిన్‌సన్ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. మంచి కుటుంబం; మంచి అబ్బాయి; కానీ ఇంతలో ఇలా ఎలా రాడికల్‌గా మారిపోయాడు అంటూ ఆశ్చర్యపోయాడు. అమెరికాలో కూడా కమ్యూనిస్టు తీవ్రవాదుల్ని రాడికల్స్ అంటారు. చార్లీ కిర్క్ క్రైస్తవ మతవాది; అతివాద జాతీయవాది. సులువుగా చెప్పుకోవాలంటే అమెరికాలో పురాతన అమెరికన్లు, సనాతన క్రైస్తవులు మాత్రమే ఉండాలని ప్రగాఢంగా నమ్మేవాడు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ‘‘అమెరికాకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరిద్దాం’’ (Make America Great Again – MAGA) అనే నినాదాన్ని ఇచ్చాడు. ఉదారవాదాన్ని తిరస్కరించడం, ప్రపంచీకరణను వ్యతిరేకించడం, అమెరికాకు వలసల్ని అడ్డుకోవడం, అన్నింటా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అనడం ఇందులో ముఖ్యమైన అంశాలు. రోనాల్డ్ రీగన్ 1980లలోనే ఇలాంటి నినాదాలు ఇచ్చాడు. అయితే, ట్రంప్ వాటికి మరింత పదునుపెట్టాడు. ట్రంప్ విధానాలను ఛార్లీ గట్టిగా అందిపుచ్చుకున్నాడు. వాటిని దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ అనే సంస్థను నెలకొల్పాడు.


2020 నవంబరు నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయాడు. అయినా ప్రెసిడెంట్ ఎలెక్ట్‌కు అధికారాన్ని అప్పచెప్పి గద్దె దిగడానికి ట్రంప్ ఒప్పుకోలేదు. 2021 జనవరి 6న వాషింగ్టన్ డీసీలో తన అనుచరులైన అల్లరిమూకలతో ఒక కపట దాడిని నిర్వహించాడు. ఆ అల్లర్లలో కిర్క్‌ కీలక పాత్ర పోషించి ట్రంప్‌కు మరింత దగ్గర అయ్యాడు. ట్రంప్ రెండోసారి శ్వేతభవన నివాసి కావడంతో కిర్క్‌ మరింత రెచ్చిపోయాడు. చార్లీకి ఉదారవాదం అస్సలు పడదు. ఒక్కసారి అందులో పడితే కొట్టుకుపోతాం అనేది అతని ప్రగాఢ నమ్మకం. ఉదారవాదం అంటే ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను గౌరవించాలి. మహిళల్ని ఆదరించాలి. అతనికి గర్భస్రావం, విడాకులు కూడా నచ్చవు. ఎల్‌జీబీటీ క్యూ హక్కులు అస్సలు నచ్చవు.

ఉదారవాదాలకు మూలం కార్ల్ మార్క్స్‌ అని అతని అక్కసు. తన ప్రత్యర్థుల్ని ‘సాంస్కృతిక మార్క్సిస్టులు’ అని తిట్టేవాడు. ఇదో విచిత్ర పదబంధం. మార్క్సిజం ఆర్థిక మూలాలను మాత్రమే పట్టించుకుంటుంది గానీ సాంస్కృతిక అంశాలను పట్టించుకోదని మన దేశంలో నయా అంబేడ్కరిస్టులు కొందరు విమర్శిస్తుంటారు. కిర్క్‌ మార్క్సిజాన్ని ఒక పెద్ద ఉపద్రవంగా పరిగణించేవాడు. ఒకసారి మార్క్సిజం వలలో పడితే ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలన్నింటిలోనూ రాజీపడాల్సి వస్తుందని అతను భావించేవాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా బలపడాలంటే ఫాసిజం, నాజీజం వంటి సిద్ధాంతాలను పునరుద్ధరించాల్సిందే అని నమ్మేవాడు. ‘సాంస్కృతిక బోల్షివిక్కు’ అనే మాటను హిట్లర్ కాలపు జర్మనీలో ఒక తిట్టుగా వాడేవారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అనుయాయులు తమ ప్రత్యర్థుల మీద ఇదే మాటను ప్రయోగిస్తున్నారు.


ట్రంప్ బలహీనపడుతున్న దశలో చార్లీ కిర్క్‌ చెలరేగిపోతుండడం చాలా మందికి చికాకు తెప్పించింది. ఆ మేరకు అమెరికా యువతరంలో అతని మీద ఏవగింపు కూడా పెరుగుతూ వచ్చింది. రాబిన్‌సన్ చాలాకాలంగా కిర్క్‌ కదలికల్ని గమనిస్తున్నట్టు విచారణలో తేలింది. కిర్క్‌ సనాతన భావాల్ని అతను అసహ్యించుకునేవాడట. అతన్ని ‘ఫాసిస్టు’ అనేవాడట. ట్రంప్ కన్నా ముందు వీడి ఆట కట్టించాలి అనే భావంతో ఉండేవాడట. కిర్క్‌ హత్యకు వాడిన తుపాకీతో పాటు కొన్ని బుల్లెట్లను కూడ రాబిన్‌సన్ నుంచి ఫెడరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక బుల్లెట్ కేసింగ్ మీద ‘రేయ్ ఫాసిస్ట్! అందుకో’ అని రాసి ఉంది. ఇంకో కేసింగ్ మీద ‘బెల్లా సియావో’ అని రాసి ఉంది. ముస్సోలిని ఫాసిస్టు పాలన రోజుల్లో అతనికి వ్యతిరేకంగా బాధితులు పాడుకున్న ఇటాలియన్ పాట పల్లవి అది. అంటే ఛార్లీ కిర్క్‌ను రాబిన్‌సన్ ఎంతగా అధ్యయనం చేశాడో అతని మీద ఎంతగా కసితో రగిలిపోయాడో అర్థం అవుతోంది.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇటలీలో ఫాసిజాన్నీ, జర్మనీలో నాజీజాన్నీ కార్ల్ మార్క్స్ అభిమానులు అంతం చేశారు. ఇప్పుడు అమెరికా ఫాసిస్టుల మీద కూడా సాంస్కృతిక మార్క్సిస్టులే తిరగబడుతున్నారు మరి.

డానీ (సమాజ విశ్లేషకులు)

ఇవి కూడా చదవండి..

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా

For More National News and Telugu News

Updated Date - Sep 14 , 2025 | 01:40 AM