BC Reservations: పార్లమెంట్లో బీసీ ప్రైవేట్ బిల్లు
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:46 AM
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి. అప్పుడే దానికి ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, ఇవ్వదో స్పష్టమవుతుంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అన్యాయం చేస్తూ వస్తోందన్నది నిజం. ఆ వాస్తవాన్ని....
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి. అప్పుడే దానికి ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, ఇవ్వదో స్పష్టమవుతుంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అన్యాయం చేస్తూ వస్తోందన్నది నిజం. ఆ వాస్తవాన్ని గత ఎన్నికల ప్రచార సమయంలో స్వయంగా రాహుల్గాంధీయే ఒప్పుకున్నారు. ఆయన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేకూరాలంటే.. ‘ఇండియా కూటమి’ పేరుతో బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందే.
ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా అయినా బీసీల పట్ల వారికున్న ‘నిజమైన అనుకూలత, చిత్తశుద్ధి’ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించగలదు. లేదంటే, మండల్ సిఫార్సుల అమలు కోసం జరిగిన ప్రజాందోళన సమయంలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన మతయాత్రలను (అడ్వాణీ ‘కమండల్ యాత్ర’ చేసినట్టు, రాజీవ్గాంధీ ‘సద్భావన యాత్ర’ చేసినట్టు) మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆ రెండు యాత్రల అసలు ఉద్దేశ్యం కూడా ‘రిజర్వేషన్లపై వ్యతిరేకతే’. ఇప్పటి జోడో యాత్ర కూడా ‘సామాజిక న్యాయం’ అనే నినాదానికి మాత్రమే పరిమితమవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అందుకే, రాహుల్గాంధీ ‘సామాజిక న్యాయం’ గురించి మాట్లాడేటప్పుడు... ‘సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయా’లనే అంశంపై పోరాడే బాధ్యత తమ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన నిరూపించుకోవాలి. తమ పార్టీ ఇచ్చిన హామీ బూటకం కాదని ‘బీసీ రిజర్వేషన్ ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో పెట్టడం’ ద్వారా కాంగ్రెస్ చాటిచెప్పాలి. లేకపోతే, బీసీలకు ఆ పార్టీ వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. బీఆర్ఎస్ను అధికారంలో నుంచి దింపేందుకు, బీసీ ఓట్లను కాంగ్రెస్ వైపునకు తిప్పేందుకు చేసిన ప్రయత్నం వాస్తవమైతే, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి ‘బీసీ బిల్లు’ కోసం కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలి. కానీ ఆయన అలాంటిదేమీ చేయడం లేదు. ‘రిజర్వేషన్లకు అడ్డం’ అంటూ కాంగ్రెస్, బీజేపీ పరస్పరం నిందించుకుంటూనే ఉన్నాయి. కానీ ‘బీసీ రిజర్వేషన్ల’ సమస్య పరిష్కారంపై ఎటువంటి చర్చ, ఆలోచన చేయడం లేదు.
పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న వామపక్షాలు అయినా బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించి దానిని పటిష్ఠం చేయాలి. కానీ వారు కూడా నామమాత్ర పాత్రకే పరిమితమవుతున్నారు. పార్లమెంట్లో బీసీ ప్రైవేట్ బిల్లును పెట్టడానికి చొరవ చూపడం లేదు. తెలంగాణకు చెందిన మాజీ, ప్రస్తుత బీజేపీ ఎంపీలు సైతం బీసీ సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల బిల్లు అమలుకు తగిన కృషి చేయడం లేదు! పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్న నెపంతో, తమ రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న భయంతోనే వారు ‘బ్రాహ్మణీయ అగ్రకుల విధానాలను’ ప్రశ్నించడానికి జంకుతున్నారు. ఈ భయంతో తమ సామాజిక చైతన్యాన్ని త్యజించి, తమ వర్గాలకే ద్రోహం చేస్తున్నారు. అయినా సరే. ఈ వర్గాల ఎంపీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీ రిజర్వేషన్ల ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో పెట్టాల్సిందే. అప్పుడే బీసీల రిజర్వేషన్లు నిజమైన హక్కులుగా మారేందుకు ముందడుగు పడుతుంది. ఒకవేళ దీనికి ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోతే, ఆ ఎంపీలకు బీసీ వర్గాల ప్రజలు రాజకీయ అనిశ్చితిని రుచి చూపించక తప్పదు. అప్పుడే ఈ సమస్యకు నిజమైన పరిష్కారం దొరుకుతుంది.
పాపని నాగరాజు
కొంకల వెంకటనారాయణ (సత్యశోధక మహాసభ)
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి