Restaurant Owner Shot Dead: వెజ్ బిర్యానీ ఇచ్చినందుకు వివాదం.. హోటల్ యజమాని దారుణ హత్య
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:19 PM
రాంచీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చినందుకు రెచ్చిపోయిన ఓ కస్టమర్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో హోటల్ యజమానిపై కాల్పులు జరపడంతో అతడు కన్నుమూశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శాకాహారి కస్టమర్కు మాంసాహారం పెట్టడంతో మొదలైన వివాదం చివరకు ఓ హోటల్ యజమాని హత్యకు దారి తీసింది. శనివారం కాంకే పిథోరియా రోడ్డులో ఈ ఘటన జరిగింది (Restaurant Owner Shot dead).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ హోటల్లో ఓ కస్టమర్ వెజ్ బిర్యానీ పార్సెల్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత మరికొందరితో కలిసి హోటల్కు తిరిగొచ్చిన అతడు గొడవకు దిగాడు. తనకు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చారంటూ రచ్చ రచ్చ చేశాడు. ఆ సమయంలో అక్కడే భోజనం చేస్తున్న హోటల్ యజమాని విజయ్ వారి కంటపడ్డాడు. ఈ క్రమంలో కస్టమర్ విజయ్పై కాల్పులు జరపడంతో అతడి ఛాతిలోకి తూటా దూసుకుపోయింది. దీంతో, కుప్పకూలిపోయిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు (Ranchi Incident).
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు. ఈ కాల్పులు క్షణికావేశంలో జరిగాయా? లేదా మరో కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
బెంగళూరులో దారుణం.. సీనియర్ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి