Hyderabad: ఈ లిఫ్ట్ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:22 AM
లిఫ్ట్లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్(5) అనే బాలుడు అపార్ట్మెంట్లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.
- లిఫ్ట్లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడి మృతి
- ఎల్లారెడ్డిగూడలో ఘటన
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ తలుపుల మధ్య ప్రమాదవశాత్తు ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్ లోపల ఉన్న కటకటాల గ్రిల్కు, బయట ఉన్న చెక్క తలుపునకు మధ్య ఇరుక్కొని నలిగిపోవడంతో మరణించాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని శ్రీకాకుళానికి(Srikakulam) చెందిన బల్లి నర్సినాయుడు, ఐశ్వర్య దంపతులు తమ కుమారులు చైత్వన్, హర్షవర్ధన్(5)తో కలిసి ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్ జి-బ్లాక్ ఐదో అంతస్తులో ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నారు. మధురానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలను తల్లి ఐశ్వర్య బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చింది. తల్లి, ఇద్దరు కుమారులు ఎప్పటిల్లాగే తాము ఉంటున్న ఐదో అంతస్తుకు లిఫ్ట్లో చేరుకున్నారు.
ఐశ్వర్య, ఆమె పెద్ద కుమారుడు లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చారు. హర్షవర్ధన్ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చే లోపే.. కింది అంతస్తులో ఎవరో లిఫ్ట్ బటన్ నొక్కడంతో లిఫ్ట్ కిందికి కదిలింది. ఈ క్రమంలో లిఫ్ట్కు లోపల ఇనుప గ్రిల్, బయట చెక్క తలుపు రెండింటి మధ్యలో హర్షవర్ధన్ ఇరుక్కుపోయాడు. ఐదు అంతస్తుల మధ్యలో ఉండిపోయిన హర్ష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది బాలుడిని పరీక్షించి అప్పటికే మరణించినట్టు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News