Hyderabad: దూసుకెళ్తున్న తూటా.. వివాదం ఏదైనా కాల్పుల మోతే
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:50 AM
మలక్పేట పోలీస్స్టేషన్ పరిధి శాలివాహన నగర్లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చందూనాయక్ హత్యకు గురైన సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. వాకింగ్కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు తుపాకీతో కాల్చి చంపారు. చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు మృతి చెందాడు. ఈ కాల్పుల మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
- నగరంలో కలవర పెడుతున్న ఘటనలు.. నేరస్థుల చేతుల్లో తుపాకులు
- యూపీ, బిహార్ నుంచి దిగుమతి.. ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడుతున్న వైనం
హైదరాబాద్ సిటీ: మలక్పేట పోలీస్స్టేషన్ పరిధి శాలివాహన నగర్లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చందూనాయక్ హత్యకు గురైన సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. వాకింగ్కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు తుపాకీతో కాల్చి చంపారు. చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు మృతి చెందాడు. ఈ కాల్పుల మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
కలవరపెడుతున్న ఘటనలు
ఇటీవల నగరంలో నేరస్థులు, దొంగలు, అంతర్రాష్ట్ర క్రిమినల్స్ కాల్పులకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న అఫ్జల్గంజ్లో ట్రావెల్ బస్సు ఉద్యోగిపై కాల్పులకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కకుండానే రాష్ట్రం దాటేసింది. ఆ ఘటన మరువకముందే మరో ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ సైబరాబాద్లోని ఓ పబ్ వద్ద ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుట్టుగా తుపాకుల వ్యాపారం
కొంతమంది వలస కార్మికులు, నేరగాళ్లు తుపాకుల విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. తమ రాష్ట్రాల నుంచి తుపాకులను తక్కువ ధరకు కొని నగరానికి దిగుమతి చేసి గుట్టుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందా నగరంలో యథేచ్ఛగా సాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది యువకులు తుపాకులతో పోలీసులకు చిక్కినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరికొందరు నేరస్థులు బిహార్, యూపీ రాష్ట్రాలకు వెళ్లి రూ. 20-30 వేలు చెల్లించి తుపాకులు, లైవ్రౌండ్స్ కొనుగోలు చేస్తున్నారు.

రియల్ మోసాలు, భూ కబ్జాలు
ఎక్కడ చూసినా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గజం రూ. లక్షన్నర పైన, ఎకరం ధర రూ.వంద కోట్లు పలుకుతుండటంతో నగరంలో రియల్ మాఫియా రెచ్చిపోతోంది. భూ వివాదాలు, కబ్జాలు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు భూ వివాదాల నేపథ్యంలో ప్రత్యర్థులతో జరుగుతున్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. తమను తాము రక్షించుకోవడానికి, ప్రత్యర్థులను బెదిరించడానికి పలుకుబడి ఉన్న వ్యక్తులు తుపాకులను కొనుగోలు చేసి పోలీసుల నుంచి లైసెన్స్ పొందుతుండగా, మరికొందరు వివిధ రాష్ట్రాల నుంచి దేశవాళీ తుపాకులు అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది క్రిమినల్స్తో దోస్తీకట్టి ముఠాలుగా ఏర్పడి ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న పరిణామాలను బట్టి చూస్తే తుపాకులతో కాల్పులు జరపడం, ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సర్వసాఽధారణంగా మారిపోయిందని పలువురు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు
- 23 ఏళ్ల సాయిరాంరెడ్డి బీకాం కంప్యూటర్ చదువును మధ్యలో ఆపేసి నేరాలబాట పట్టాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. జైల్లో ముంబై క్రిమినల్స్తో పరిచయం పెంచుకున్న నిందితుడు ముంబై నుంచి అక్రమంగా ఆయుధాలు దిగుమతి చేసుకొని నగరంలో విక్రయానికి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
- బాలాపూర్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ హత్య కేసులో గోల్కొండకు చెందిన సుపారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ నుంచి తుపాకులు తెప్పించుకొని హత్యకు పాల్పడినట్లు తేలింది.
- జీడిమెట్లలో కొద్దిరోజుల క్రితం ఓ ప్రధాన రాజకీయనాయకుడి అనుచరుడు అర్ధరాత్రి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి హల్చల్ చేశాడు. ప్రత్యర్థులపై తుపాకీతో గురిపెట్టి గాల్లోకి కాల్చాడు.
- కొద్దిరోజుల క్రితం టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ప్రత్యర్థులు ఓ యువకుడిని కాల్చి చంపారు.
- తుపాకీతో తిరుగుతున్న ఓ వ్యక్తిని బేగంపేట పోలీసులు కొద్దిరోజుల క్రితం పట్టుకున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి ప్రత్యర్థుల నుంచి రక్షించుకోవడానికి నగరంలో తలదాచుకుంటున్నాడు.ప్రాణహాని ఉందని తెలిసిన వారి ద్వారా బిహార్ వెళ్లి రూ. 22 వేలకు తుపాకీని కొని తెచ్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News