Share News

Hyderabad: సైబరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

ABN , Publish Date - Sep 11 , 2025 | 09:53 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి అల్వాల్‌, పేట్‌బషీరాబాద్‌ పరిధుల్లో అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ ముఠా రెచ్చిపోయింది. మూడు చోట్ల స్నాచింగ్‌కు యత్నించిన దొంగలు.. రెండు చోట్ల విఫలంగా కాగా, ఒక్కచోట వృద్ధురాలి మెడలో 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.

Hyderabad: సైబరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

- మూడు చోట్ల చోరీకి యత్నం

- ఒకచోట వృద్ధురాలి మెడలో 4.5 తులాల గొలుసు స్నాచింగ్‌

- కూకట్‌పల్లి వైపు పారిపోయిన దొంగలు

- నలుగురు అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసుల అనుమానం

హైదరాబాద్‌సిటీ: సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధి అల్వాల్‌, పేట్‌బషీరాబాద్‌ పరిధుల్లో అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ ముఠా రెచ్చిపోయింది. మూడు చోట్ల స్నాచింగ్‌కు యత్నించిన దొంగలు.. రెండు చోట్ల విఫలంగా కాగా, ఒక్కచోట వృద్ధురాలి మెడలో 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. గొలుసును ఆమెను గట్టిగా పట్టుకోవడంతో అర తులం గొలుసు మాత్రమే మిగిలింది. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగల స్నాచింగ్‌కు పాల్పడిన తీరును బట్టి వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌, ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఈ దొంగల ముఠా నగరంలో రెండు బైక్‌లను చోరీ చేసి వాటిపై తిరుగుతూ.. చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


అల్వాల్‌ పంచశీల కాలనీలోని ప్రెసిడెన్సీకాలనీలో బైక్‌పై వచ్చిన స్నాచర్స్‌ మంగళవారం రాత్రి మహిళల మెడలో నుంచి గోల్డ్‌చైన్‌ దొంగలించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రెసిడెన్సీ కాలనీ రోడ్డు నెంబర్‌ 4లో నివసించే పద్మ తాను నివసించే ఇంట్లోకి గేటు తీసుకొని వెళ్తుండగా, అప్పటికే అక్కడ మాటువేసిన దొంగలు ఆమె మెడలోని గొలుసును తెంచుకెళ్లేందుకు దాడి చేశాడు. ఆమె అప్రమత్తం కావడంతో మోటారు సైకిల్‌పై పరారయ్యారు. ఆ తర్వాత పంచశీలకాలనీ రోడ్డు నెంబర్‌-7లో రాధిక అనే మహిళా మెడలో నుంచి కూడా చైన్‌ అపహరించేందుకు యత్నించి విఫలయయ్యాడు. అప్పటికే చైన్‌ స్నాచర్‌ తిరుగుతున్నాడని కాలనీల్లో ప్రచారం కావడంతో దొంగ పేట్‌బషీరాబాద్‌ పీస్‌ పరిధిలోకి పారిపోయినట్లు గుర్తించారు.


city5.2.jpg

పేట్‌బషీరాబాద్‌లో స్నాచింగ్‌..

బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు సిద్ది వినాయక అపార్టుమెంట్‌ వద్ద మంగళవారం రాత్రి ఓ మహిళ మెడలో చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. బుధవారం ఉదయం కొంపల్లి ఎన్‌సీఎల్‌ బస్టాప్‌ వద్ద నిలబడి ఉన్న ప్రియ అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాగేందుకు దుండగులు ప్రయత్నించి అక్కడ కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై గుండ్ల పోచంపల్లిలోని కేవీఎన్‌ రెడ్డి కాలనీలో మేరీ ఆస్పత్రి సమీపంలోని సర్వీస్‌ రోడ్డులో వృద్ధురాలు బాలమణి (60) ఉదయం వాకింగ్‌ చేస్తుండగా.. మెడలో పుస్తెల తాడును దొంగలు లాగారు. వెంటనే అప్రమత్తమైన ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో 4.5 తులాల దోచుకెళ్లారు. ఒక అర తులం ఆమె చేతికి చిక్కింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు 100కు డయల్‌ ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని, సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బోయిన్‌పల్లిలో రెండు బైక్‌లు చోరీ చేసి..

మొత్తం నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు నగరానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి బోయిన్‌పల్లిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నలుగురు దొంగలు విడిపోయి ఇద్దరు అల్వాల్‌ పరిధిలో స్నాచింగ్‌లకు ప్రయత్నించగా.. ఇద్దరు పేట్‌బషీరాబాద్‌ పరిధిలో స్నాచింగ్‌లకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఆ తర్వాత దొంగలు కూకట్‌పల్లి, కేపీఎహెచ్‌బీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దొంగలు నగరంలోనే దాక్కున్నారా..? లేక నగరం వదిలి పారిపోయారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 09:53 AM