Chennai News: ఆలయంలో దోపిడీ, హత్య..
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:53 AM
విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్మన్లుగా పనిచేస్తున్నారు.
- రాజపాళయంలో ఇద్దరు వాచ్మన్ల హత్య
- స్వర్ణాభరణాలు, పంచలోహ విగ్రహాల దోపిడీ
చెన్నై: విరుదునగర్(Virudunagar) జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అర్చకులు వచ్చి ఆలయాన్ని తెరవగా ఆ ఇరువురూ రక్తపుమడుగులో శవాలుగా పడివున్నారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మూడువైపులా ఎత్తయిన ప్రహరీ ఉన్న ఆ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. ఆ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించగా, సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు రెండు కార్లలో పదిమంది దుండుగులు ఆలయానికి వచ్చి, సీసీ కెమెరా(CCTV camera)లను ఒక్కొక్కటిగా పగులగొట్టి, వెనుకవైపున్న స్తంభా ల ఆధారంగా ఆలయ ప్రాంగణంలోకి దూకారు. ఆలయం లోపల ఉన్న వాచ్మన్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఆ దుండుగులు వారిపై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశించి విగ్రహాలకు ఉన్న బంగారు ఆభరణాలను, ప్రాచీన పంచలోహ విగ్రహాలను దోచుకెళ్ళారు. ఈ సమాచారం తెలుసుకుని మదురై సర్కిల్ డీఐజీ అభినవ్ కుమార్, ఎస్పీ కన్నన్ ఇతర పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ఆలయంలో సీసీ ఫుటేజీ ఆధారంగా కార్లలో వచ్చిన పదిమంది దుండగులు పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆ పదిమందిలో కొందరు ఆలయం లోపలకు దూకి వాచ్మెన్లను హతమార్చి దోపిడికీ పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకులను గుర్తించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హాయ్ల్యాండ్కు గ్రూప్-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్
Read Latest Telangana News and National News