Anand Mahindra: ట్రంప్ టారిఫ్స్లను అవకాశాలుగా మల్చుకోవచ్చు: ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:47 PM
భారత్పై అదనపు సుంకాలు, జరిమానా విధిస్తూ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థ షాక్ కు గురైంది. అయితే, ఈ పరిస్థితిని మన దేశానికి అనుకూలంగా మలచుకోవచ్చని చెబుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: భారత్పై అదనపు సుంకాలు, జరిమానా విధిస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థ షాక్ కు గురైంది. అమెరికాకు ఎగుమతులు చేసే మన పారిశ్రామిక రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితిని మన దేశానికి అనుకూలంగా మలచుకోవచ్చని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంటున్నారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
'అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన టారిఫ్ల యుద్ధంతో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలు సొంత వ్యూహాలకు పదునుపెట్టాయి. ఫలితంగా ప్రపంచవృద్ధికి కొత్త శక్తులుగా తయారవుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ పరిస్థితుల్ని అవకాశంగా మల్చుకోవాలి. 1991లో మన దేశంలో ఏర్పడిన విదేశీ మారక నిల్వల సంక్షోభంతో లిబరలైజేషన్కు నాంది పడింది. ఇప్పుడు కూడా ఈ సుంకాల యుద్ధాన్ని తట్టుకునేందుకు రెండు బలమైన అడుగులు వేయాలి' అని ఆనంద్ అన్నారు.
దేశంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని వేగంగా మెరుగుపర్చాలని, పెట్టుబడులు పెట్టే వారికి సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని ఆనంద్ సూచించారు. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ మారాలని అన్నారు. తయారీ రంగంపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాలని, తద్వారా పోటీతత్వాన్ని పెంచాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. వీటితో పాటు ఎంఎస్ఎంఈ(MSME)లకు రుణాలు సమకూర్చాలని ఆయన అన్నారు.
ఇక, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆనంద్ అన్నారు. ఈ రంగంతో ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉందని.. వీసా ప్రాసెసింగ్, టూరిజం కారిడార్ల వంటి వాటిని మెరుగుపర్చాలని ఆనంద్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం