TCS Laying Off: టీసీఎస్ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:00 PM
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం నిజమేనా, కంపెనీ ఏం చెప్పిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగాల తొలగింపు గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్లో టీసీఎస్ దాదాపు 80,000 మంది ఉద్యోగులను తొలగించిందన్నారు (TCS Laying Off). ఆ క్రమంలో కొందరికి 18 వేల జీతం ఇవ్వగా, మరికొందరికి 3 నెలల జీతం, ఇంకొందరికి ఎలాంటి ప్యాకేజీ లేకుండా తొలగించిందని పేర్కొన్నారు. ఆ పోస్ట్ నెట్టింట వెరల్ అవుతున్న నేపథ్యంలో అది నిజమేనా? టీసీఎస్ నిజంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టీసీఎస్ అధికారిక ప్రకటన ఏంటి?
జులై 2025లో టీసీఎస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, కంపెనీ తమ గ్లోబల్ వర్క్ఫోర్స్లో 2% మందిని, అంటే సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులు ప్రధానంగా మధ్య, సీనియర్ గ్రేడ్లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని చెప్పింది. జూన్ 30, 2025 నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069. ఈ సంఖ్యలో 2% అంటే సుమారు 12,261 మంది మాత్రమే ప్రభావితం అవుతారని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80,000 మంది ఉద్యోగుల తొలగింపు వాదనను టీసీఎస్ ప్రతినిధి ఖండించారు. ఈ వాదనలు తప్పుదారి పట్టించేవని అన్నారు. మా వర్క్ఫోర్స్లో కేవలం 2% మందిపై మాత్రమే ప్రభావం ఉంటుందని మేము ఇంతకు ముందే ప్రకటించామని వెల్లడించారు.
ఈ తొలగింపులకు కారణం ఏంటి?
టీసీఎస్ ఈ తొలగింపులను తమ వ్యాపార వ్యూహంలో భాగంగా చెబుతోంది. కంపెనీ తమను ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, మార్కెట్ విస్తరణ, వర్క్ఫోర్స్ రీఅలైన్మెంట్పై దృష్టి సారిస్తోంది. ఈ ప్రక్రియలో కొందరు ఉద్యోగులను రీస్కిల్ చేయడం లేదా రీ డిప్లాయ్ చేయడం జరుగుతోంది.
ఆ క్రమంలో కొందరు ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఈ తొలగింపులు ఈ సంవత్సరం కాలంలో క్రమంగా జరిగాయని, ప్రభావిత ఉద్యోగులకు తగిన సెవరెన్స్ బెనిఫిట్స్, ఔట్ప్లేస్మెంట్, కౌన్సెలింగ్, సపోర్ట్ అందించినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు సమాచారం పోస్ట్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి