Share News

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

ABN , Publish Date - May 15 , 2025 | 03:26 PM

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. మళ్లీ అప్పుడప్పుడు కాల్పులకు తెగబడుతోంది. ఈ రెండు దేశాల మధ్య 1947లో జరిగిన విభజన తర్వాత భారత్.. పాకిస్థాన్ సహా గల్ఫ్ దేశాలకు కూడా సాయం చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..
RBI Currency Assistance Pakistan

ఇటీవల భారత్, పాకిస్థాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య 1947లో జరిగిన విభజన గురించి ఓ ఆకస్తికర విషయం తెలిసింది. ఈ విభజనలో రాడ్‌క్లిఫ్ లైన్ కీలక పాత్ర పోషించగా, దీనిని బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ రూపొందించారు. ఈ రేఖ పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను భారతదేశం, పాకిస్థాన్‌గా విభజించింది. అయితే, ఈ రేఖ రెండు దేశాలకు అవసరమైన వనరులను నిజంగా అందించిందా? ఈ రేఖను రూపొందించిన రాడ్‌క్లిఫ్ ఎన్నడూ భారతదేశాన్ని సందర్శించలేదు. విభజన తర్వాత, పాకిస్థాన్ అనేక ఆర్థిక, మౌలిక సవాళ్లను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన పొరుగు దేశానికి ఎలాంటి సాయాన్ని అందించిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


విభజన, ఆర్థిక సవాళ్లు

1947లో భారత స్వాతంత్ర చట్టం ద్వారా భారతదేశం, పాకిస్థాన్ రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. ఈ విభజన మతపరంగా జరిగింది. దీనిలో రాడ్‌క్లిఫ్ లైన్ రెండు దేశాల సరిహద్దులను నిర్ణయించింది. అయితే, ఈ విభజన పాకిస్థాన్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్‌కు కేంద్ర బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ లేదా కరెన్సీ ముద్రణ సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పాకిస్థాన్‌కు సహాయం అందించింది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం

1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబరు వరకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్థాన్ కోసం కరెన్సీ నోట్లను ముద్రించింది. విభజన సమయంలో, పాకిస్థాన్‌కు సొంత కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేసే సామర్థ్యం లేకపోవడంతో, భారత రిజర్వ్ బ్యాంక్ రెండు దేశాలకు ఉమ్మడి కేంద్ర బ్యాంక్‌గా వ్యవహరించింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంది. 1947 ఆగస్టు 14న, అవిభక్త భారతదేశ గవర్నర్-జనరల్ “పాకిస్థాన్ (మానిటరీ సిస్టమ్ అండ్ రిజర్వ్ బ్యాంక్) ఆర్డర్ 1947 కూడా జారీ చేశారు. ఈ ఆదేశం ప్రకారం, పాకిస్థాన్‌లో కేంద్ర బ్యాంక్ ఏర్పాటు అయ్యే వరకు RBI అన్ని కరెన్సీ సంబంధిత విషయాలను నిర్వహించింది.


గల్ఫ్ దేశాలకు కూడా..

ఈ క్రమంలో 1948 సెప్టెంబరు 30 వరకు, RBI భారతదేశం, పాకిస్థాన్ రెండింటికీ ఉమ్మడి కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. ఈ సమయంలో RBI పాకిస్థాన్ అన్ని ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు దాని ద్రవ్య వ్యవస్థను నిర్వహించింది. ఈ సమయంలో RBI లాహోర్‌లో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి తర్వాత మూసివేశారు. RBI సేవలు కేవలం పాకిస్థాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల కోసం కూడా RBI కరెన్సీ నోట్లను ముద్రించింది. 1967 వరకు గల్ఫ్ దేశాలు భారతీయ రూపాయిని తమ కరెన్సీగా ఉపయోగించాయి. ఈ వాస్తవం RBI విస్తృత ప్రభావాన్ని, ఆర్థిక నైపుణ్యాన్ని తెలియజేస్తుందని చెప్పవచ్చు.


Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

చైనాకు బుద్ధి చెప్పిన భారత్

గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 15 , 2025 | 03:29 PM