Jagan Strategy: కలిసికట్టుగా బురద జల్లుదాం
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:13 AM
‘‘పార్టీ వేరు, పత్రిక వేరూ కాదు! అందరం కలిసి పని చేయాలి. ప్రభుత్వం గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి.
ముసుగు తొలగించిన ‘వైసీపీ పత్రిక’
పార్టీ నేతలతో సమన్వయ భేటీలు
ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యం
సాక్షి పత్రికలో ఏది పడితే అది రాసేయాలి
చిన్న సమస్యనూ పెద్దగా చూపించాలి
ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించాలి
పరస్పరం సమాచారం పంచుకోవాలి
రోత పత్రికలో వార్తలు రాగానే..
వైసీపీ పరంగా రాజకీయ ఆందోళనలు
జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి భేటీలు
తిరుపతిలో జరిగిన తొలి సమావేశం
భూమన, చెవిరెడ్డి, రోజా సహా పలువురు నేతలు హాజరు
‘సమస్య చిన్నదైనా సరే... భూతద్దంలో చూపించాలి! దానిని సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్లు కాకుండా... పాలకుల వైఫల్యంగా చిత్రీకరించాలి. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి’... ఇదీ జగన్ రోత పత్రిక, ఆయన పార్టీ ఉమ్మడి వ్యూహం! సర్క్యులేషన్ పెంచుకోవడంతోపాటు... కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేలా తీర్మానం! జిల్లాలు, ప్రాంతాల వారీగా ‘పార్టీ-పత్రిక’ సమావేశాలు పెట్టి మరీ కార్యాచరణకు నిర్దేశం! అధికారంలో ఉండగా... సొంత మీడియాకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు! అధికారం పోగానే... ప్రభుత్వంపై బురదజల్లడమే ‘పార్టీ పత్రిక’ లక్ష్యంగా మార్చారు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘పార్టీ వేరు, పత్రిక వేరూ కాదు! అందరం కలిసి పని చేయాలి. ప్రభుత్వం గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి. అలాగే... ప్రభుత్వం వైపు నుంచి ఏ తప్పు దొరికినా పార్టీ నేతలు సాక్షి ప్రతినిధులకు చెప్పాలి. దేనినీ వదలొద్దు. ఏది దొరికితే అది కుమ్మేయాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి’’... ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రోత మీడియా ప్రతినిధులకూ, వైసీపీ నేతలకూ చేసిన దిశా నిర్దేశం! ‘తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. రాజకీయంగా లబ్ధి పొందాలి. దీంతోపాటు పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలి’... అనేదే వ్యూహం! దీనికోసం... పార్టీకీ, పత్రికకూ మధ్య ‘సమన్వయం’ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలివిడతగా గురువారం తిరుపతిలో జగన్ మీడియా ప్రతినిధులు, వైసీపీ నేతలు సంయుక్త చర్చలు జరిపారు. శుక్రవారం నెల్లూరులో ఆ తరహా మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారు.
అసలు నేపథ్యం ఇదీ...
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే విమర్శలకు తెరలేపింది. అటు... ఆయన మీడియా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై బురదజల్లుతోంది. అయితే... ఇవేవీ ప్రజలను ప్రభావితం చేయలేదు. జగన్ అనేక పిలుపులు ఇచ్చినా... ఫలితం కనిపించలేదు. చివరికి... ‘జూన్ 4’వ తేదీన నిర్వహించిన వెన్నుపోటు దినంలోనూ ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు. పార్టీ నేతల నుంచీ స్పందన అంతంత మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనలు, పోరాటాలు చేస్తే తాను ఆశిస్తున్న ‘2.0’ సాధ్యంకాదని జగన్ గ్రహించారు. తన ఆరోపణలు, విమర్శలతోపాటు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రోజువారీగా వండివార్చే తన పత్రికను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పదేపదే చెప్పే అబద్ధాలనే నిజమని నమ్మించాలని... పార్టీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వ్యూహం రచించారు. అందులో భాగంగానే... ‘సమన్వయ’ సమావేశాలు మొదలుపెట్టారు.
పార్టీ పత్రిక అసలు రంగు
‘సాక్షి’... జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా! జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ప్రభుత్వంపై బురదజల్లి, వ్యతిరేకత పెంచి అధికారంలోకి వచ్చేందుకు మీడియాను వాడుకున్నారు! అధికారంలోకి రాగానే... సొంత మీడియాకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు ప్రభుత్వాన్ని వాడుకున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వ సొమ్మును అలవెన్సు రూపంలో ఇచ్చి రోత పత్రికకు చందాదారులుగా మార్చారు. వలంటీర్లు కొందరు ప్రజలతో కూడా చందాలు కట్టించారు. ఎంత చేసినప్పటికీ... ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ‘బలవంతంగా పెంచుకున్న’ సర్క్యులేషన్ ఒక్కసారిగా పడిపోయింది. తన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు ప్రజలకు చేరాలంటే సర్క్యులేషన్ పెంచుకోవాలి. దీనికోసమే... ‘స్వతంత్ర మీడియా’ అనే ముసుగును పూర్తిగా తొలగించేశారు. తన పత్రికను బహిరంగంగానే ‘పార్టీ పత్రిక’గా మార్చేశారు. వైసీపీ నేతలతో కలిసి పని చేయాలని పత్రికను... పత్రికకు పూర్తిగా సహకరించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
అజెండా ఒక్కటే... : జగన్ ఆదేశాల మేరకు... తిరుపతిలో తొలి ‘సమన్వయ’ సమావేశం జరిగింది. గురువారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలకనేత భూమన కరుణాకర్రెడ్డి నివాసంలో ‘సాక్షి’ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు... ప్రత్యేకించి రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆయా అంశాలపై ప్రస్తుతం రోత పత్రిక ఇస్తున్న కవరేజ్, సర్క్యులేషన్ పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఆ తర్వాత మీటింగ్ను ‘రిట్జ్’ హోటల్కు మార్చారు. అక్కడ జగన్ మీడియా కీలక కార్యనిర్వహణ ప్రతినిధితోపాటు... వైసీపీ నేతలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రోజా, భూమన అభినయ్రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్రెడ్డి, సత్యవేడు నేత ఎన్.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవే అయినా... వాటికి మీడియాలో చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చిత్రీకరించాలి’’ అని నిర్ణయించారు. సమస్య చిన్నదా? పెద్దదా? అన్నది చూడకుండా... దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించేలా వార్తలు రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే క్రమంలో... జగన్ పత్రికలో వచ్చే అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని, ఇలా సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్న ఎలాంటి సమాచారమైనా పరస్పరం పంచుకోవాలని కూడా తీర్మానించుకున్నట్లు తెలిసింది.