East Godavari : ప్రేమించడంలేదని యువతిపై దాడి
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:11 AM
ఇంటర్ చదువుతున్న యువతిపై దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులకు ఫిర్యాదు.. యువకుడి అరెస్టు
తాళ్లపూడి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న యువతిపై దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గొల్ల దిలీప్ కుమార్ (19) చదువు మధ్యలో ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న యువతి (19)ని కొన్నాళ్లుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అయితే ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. బుధవారం ఆమె చదువుతున్న కళాశాల వద్దకు వెళ్లిన దిలీప్... తనను ప్రేమించాలని, లేదంటే ‘నీ జీవితాన్ని నాశనం చేస్తాను’ అని యువతిని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో పక్కనే ఉన్న కర్రతో దాడికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేసుకుంటూ అక్కడినుంచి పారిపోయి బాత్రూమ్లో దాక్కుంది. కళాశాల సిబ్బంది రావడంతో దిలీప్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం యువతి తన తల్లిదండ్రుల సహకారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దిలీప్ కుమార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.