Worker Union : ‘విశాఖ ఉక్కు’ను విక్రయించొద్దు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:33 AM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి.

నిధులిచ్చి బలోపేతం చేయాలి
ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా..
కేంద్ర ఆర్థిక మంత్రికి బీఎంఎస్ వినతి
న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. ఈ కర్మాగారంతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయించవద్దని.. సాధ్యమైనంత మేరకు వాటికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ప్రి-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సీఐటీయూ, ట్రేడ్ యూనియన్ కోఆర్టినేషన్ సెంటర్ (టీయూసీసీ), బీఎంఎస్, ఐఎన్టీయూసీ సహా దేశంలోని 11 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్ ప్రతినిధి పవన్కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పింఛను పథకాన్ని రద్దు చేసి పాత పింఛను పథకాన్నే (ఓపీఎస్) పునరుద్ధరించాలని.. చివరగా తీసుకున్న జీతంలో సగం మొత్తం పింఛనుగా వచ్చేలా చూడాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అంగన్ వాడీ వేతనాలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. నిర్మాణ కార్మికులకు ఆయుష్మాన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇళ్లలో పనిచేసేవారికి సామాజిక భద్రత కల్పించే విషయం పరిశీలిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈపీఎఫ్ కనీస పెన్షన్ను రూ.5 వేలకు పెంచాలని, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి. సోమవారంతో నిర్మలా సీతారామన్ జరిపిన 9 రౌండ్ల ప్రి-బడ్జెట్ సంప్రదింపుల పర్వం ముగిసింది.