GVMC Dy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే..
ABN , Publish Date - May 19 , 2025 | 12:38 PM
GVMC Dy Mayor: గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జీవీఎంసీ మేయర్ హరి కుమారిపై కూటమిలోని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.
విశాఖపట్నం, మే 19: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్లు కావాల్సి ఉండగా.. సోమవారం 54 మంది మాత్రమే కౌన్సిల్కు హాజరయ్యారు. దీంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. అయితే గతంలో మొత్తం 74 మంది కోరం సభ్యులుగా ఉండేవారు. అంటే.. దాదాపు 20 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం ఉన్నారు. వారంతా ఎందుకు హాజరు కాలేదనే విషయం సైతం తేలాల్సి ఉంది. అంటే సమన్వయ లోపం ఏమైనా జరిగిందా? అనే చర్చ సైతం సాగుతోంది. కూటమిలోని పార్టీల సర్దుబాటులో భాగంగా ఈ పదవి జనసేనకు కేటాయించారు. అయితే ఈ డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి కేటాయించడంపై టీడీపీలోని పలువురు కార్పొరేటర్లు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జీవీఎంసీ మేయర్ హరి కుమారిపై కూటమిలోని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే డిప్యూటీ మేయర్పై సైతం అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో ఆ పదవి జనసేన పార్టీకి కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.
డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఎవరికి కేటాయించాలనే పేరు సైతం ఇప్పటికే ఖరారైంది. ఆ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం ఈ ఎన్నికను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాంతో పూర్తి స్థాయి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులంతా మంగళవారం ఈ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరవుతారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
Kadiri Municipality: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్గా దిల్షాద్ ఉన్నీసా
Vizianagaram: బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
For AndhraPradesh News And Telugu News