Ganta Srinivasa Warn YSRCP: హద్దు మీరితే తోక కట్ చేస్తాం.. వైసీపీకి గంటా వార్నింగ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:55 AM
జగన్ తన పర్యటనలో లా అండ్ ఆర్డర్కు ఇబ్బందులు కలిగించారని గంటా శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ ఉందని... ఇటువంటి సమయంలో జగన్ వస్తున్నారన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 8: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) విశాఖ పర్యటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas Rao) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు (గురువారం) జగన్ విశాఖకు వచ్చి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కు వెళ్తామని అంటున్నారని.. ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు 63 కిలో మీటర్లు రోడ్ షో వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందన్నారు. చాలా దూరం కాబట్టి హెలికాప్టర్లో వెళ్ళమని పోలీసులు చెప్పారని తెలిపారు. వైసీపీ హయాంలో పాలన ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్ట్లో ఆనాడు చంద్రబాబును అడ్డుకున్నారని.. పవన్ కళ్యాణ్ను అడ్డుకున్నట్లు తాము చేయగలమన్నారు. కానీ అలా చేయమని.. జగన్ పర్యటనకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో కూడా ఏపీలో చాలా చోట్ల జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చామని.. ఎలాంటి సంఘటనలు జరిగాయో అందరికీ తెలుసని మాజీ మంత్రి అన్నారు.
జగన్ తన పర్యటనలో లా అండ్ ఆర్డర్కు ఇబ్బందులు కలిగించారని విమర్శించారు. విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ ఉందని... ఇటువంటి సమయంలో జగన్ వస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు కట్టాలని అనుకున్నారని తెలిపారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పునాది స్థాయిలో ఉంటే.. వైసీపీ కార్యాలయాలు మాత్రం మహారాజ ప్యాలెస్లా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రుషికొండలో ప్రజా ధనంతో ప్యాలెస్ కట్టారని మండిపడ్డారు. జగన్ కల్తీ మద్యం కోసం మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని దుయ్యబట్టారు. తమిళనాడులో విజయ్ కార్యక్రమంలో 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటే.. మక్కెలు ఇరగ కొడతామని మాజీ మంత్రి హెచ్చరించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని.. నిబంధన ఉల్లంఘిస్తే చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. జగన్ వి వీకెండ్ రాజకీయాలని విమర్శించారు. దేని కోసం కోటి మందితో సంతకాలు చేస్తామని అంటున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదన్నారు. జగన్కు అక్కడికి వెళ్లడానికి సిగ్గు ఉండాలని విమర్శించారు. హద్దు మీరితే... తోక ఎలా కట్ చేయాలో చంద్రబాబుకు తెలుసన్నారు. ఇటీవల పెద్దిపాలెంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అత్యంత రహస్యంగా మీటింగ్ పెట్టారని.. అంత రహస్యంగా సమావేశాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ పై..
‘స్టీల్ ప్లాంట్ కోసం నేను రాజీనామా చేశాం. మేము స్టీల్ ప్లాంట్ కోసం 11 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని తెచ్చాం. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి ప్యాకేజీ రాలేదు’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
జగన్ రోడ్ షోకు అనుమతి.. షరతులు వర్తిస్తాయ్
Read Latess AP News And Telugu News