Kurnool : ‘బిల్వ మంగళుడు’ బీసీ కృష్ణ కన్నుమూత
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:27 AM
అపారమైన కీర్తి గడించి పెట్టిన బీసీ కృష్ణ(80) శనివారం రాత్రి కర్నూలు నగరంలో కన్నుమూశారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
రాష్ట్ర స్థాయి కళాకారుడిగా గుర్తింపు
నాలుగు వేలకు పైగా ప్రదర్శనలు
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కర్నూలు బిల్వమంగళుడిగా నాటకరంగానికి అపారమైన కీర్తి గడించి పెట్టిన బీసీ కృష్ణ(80) శనివారం రాత్రి కర్నూలు నగరంలో కన్నుమూశారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స తీసుకుంటూ, కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. కర్నూలు నాటక రంగానికి రాష్ట్రస్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చిన ప్రముఖుల్లో ఒకరిగా ఆయన కీర్తి రంగస్థలం మీద శాశ్వతంగా విరాజిల్లుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన చింతామణి నాటకంలో బిల్వ మంగళుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. వాచకం, నటనా కౌశలం, అభినయ చాతుర్యాలను గుర్తించి కేవలం బీసీ కృష్ణ కోసమే పరమహంస నాట్య కళా సమితిని స్థాపించి, ఆనాటి విఖ్యాత నటులు కేవీ రాఘవరావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారిని కర్నూలుకు పిలిపించి, వారికి కర్నూలులో నివాసం కల్పించి బీసీ కృష్ణకు శిక్షణ ఇప్పించారు. అలా పద్య నాటక రంగంలో ఆరంగ్రేటం చేసిన బీసీ కృష్ణ మొదట సత్య హరిశ్చంద్రలో హరిశ్చంద్రునిగా, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణునిగా నటించారు. అయితే చింతామణి నాటకంలో బిల్వ మంగళుని పాత్ర ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది.
పురస్కారాలు ఎన్నో..
బీసీ కృష్ణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ఉత్తమ నటుడుగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.. టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కందుకూరి పురస్కారం కూడా ఆయనకు లభించింది. అలాగే ఎన్నో కళాపరిషత్తుల పోటీ లకు ఆయన న్యాయ నిర్ణేతగా వెళ్లి సత్కారాలు అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో గొప్ప కళాకారునిగా గుర్తింపు పొందిన బీసీ కృష్ణ మృతి కళారంగానికి తీరని లోటని కర్నూలు జిల్లా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒక గొప్ప రంగస్థల కళాకారుడిని కోల్పోయిందన్నారు.