Cyber Crime : సైబర్ క్రైమ్ నిధుల మళ్లింపు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:04 AM
సైబర్ క్రైమ్ నిధుల మళ్లింపు వ్యవహారంలో రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన...

తెలంగాణ పోలీసుల అదుపులో ఇద్దరు ఏపీ వాసులు
అమలాపురం టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సైబర్ క్రైమ్ నిధుల మళ్లింపు వ్యవహారంలో రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరిని తెలంగాణలోని నిజామాబాద్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆ వివరాలు వెల్లడించారు. రూ.48లక్షల మేర నగదు లావాదేవీలు జరిపిన వ్యవహారంపై తొలుత గుజరాత్ పోలీసులు అమలాపురంలోని వస్త్ర వ్యాపారి తిలక్కుమార్కు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన స్పందించలేదు. అయితే సైబర్ క్రైమ్ లింకులు నిజామాబాద్కు కూడా ఉండడంతో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అమలాపురం చేరుకుంది. స్థానిక వస్త్ర వ్యాపారి తిలక్కుమార్కు చెందిన బ్యాంకు ఖాతాను ఆ షాపులో పనిచేస్తున్న ఓ మహిళ రాజోలుకు చెందిన సురేశ్ కుమార్కు అప్పగించింది. ఇటీవల ఆ ఖాతాకు రూ.48లక్షల మేర నగదు లావాదేవీలు జరగడం, వాటిని ఇతర ఖాతాలకు మళ్లించడంలో సురేశ్ కుమార్ను కీలక పాత్రధారిగా భావిస్తున్నారు. గుజరాత్ కేంద్రంగా సైబర్ క్రైమ్ నిర్వాహకులతో సురేశ్ కుమార్కున్న సంబంధాలపై సైబర్క్రైమ్ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో అమలాపురం చేరుకున్న నిజామాబాద్ పోలీసులు తిలక్కుమార్, సురేశ్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు.