YS Jagan: వారంతా అమాయకులు
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:54 AM
వైఎస్ జగన్ తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించి వారిని అమాయకులుగా అభివర్ణించారు. పోలీసుల దౌర్జన్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి, కేసులపై స్పష్టత లేకుండా నిర్దోషులపై దాడి చేయడం సరికాదని అన్నారు.
చిన్ననాటి స్నేహితులు.. కానిస్టేబులే వారిపై దౌర్జన్యం చేశారు
పాత కేసులున్నాయేమో.. తెలియదు
అందుకని అంత దారుణంగా కొడతారా?
రౌడీషీటర్లకు మద్దతుగా తెనాలిలో జగన్ వ్యాఖ్యలు
మొక్కుబడిగా సాగిన పరామర్శ తంతు
రౌడీషీటర్లను కలుస్తారని తొలుత ప్రచారం
కానీ, కుటుంబాలను మాత్రమే పలకరించి వెనక్కి
రౌడీషీటర్లకు మద్దతుగా తెనాలిలో జగన్ వ్యాఖ్యలు
తెనాలి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): పోలీసుల దాడిలో గాయపడిన రౌడీషీటర్ల కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ మంగళవారం తెనాలిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, కానిస్టేబుల్పై దాడిచేసిన కేసులో ముద్దాయిలు దోమా రాకేశ్, జాన్ విక్టర్, నవీన్, కరీముల్లాకు మద్దతుగా ఆయన మాట్లాడారు. వీరిని ఉద్దేశించి ‘అమాయకులు’ అంటూ సమర్థించారు. ‘పోలీసులు ఇంత దారుణంగా కొడతారా?’ అంటూ ఆక్రోశించారు. వారిపై పాత కేసులున్నాయేమో.. తనకు తెలియదని సెలవిచ్చారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ షరా మామూలుగానే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై అవాకులుచవాకులు మాట్లాడారు. తనకు నచ్చని మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. జగన్ హయాంలో కొందరు ఐపీఎ్సలు వైపీఎ్సలుగా వ్యవహరించి, ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. అలాంటిది పోలీసు వ్యవస్థకు జగన్ సుద్దులు చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు అదుపుతప్పి పోయారనీ,... ఆ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఈ పర్యటనలో ఆయన రౌడీషీటర్లు రాకేశ్, జాన్ విక్టర్తోపాటు నిందితుడు కరీముల్లాలను కలుస్తారని జగన్ మీడియా మొదట ఊదరగొట్టింది. కానిస్టేబుల్పై దాడి కేసులో అరెస్టు అయిన వీరంతా మూడురోజుల క్రితమే బయటకు వచ్చారు. అయినా, వారిని కాకుండా, ఆ ముగ్గురి కుటుంబసభ్యులను మాత్రమే పరామర్శించి జగన్ వెనుదిరగడం గమనార్హం. పర్యటనలో భాగంగా ఆయన దోమా రాకేశ్ ఇంటికి వెళ్లారు. మిగతా ముగ్గురి కుటుంబాలను అక్కడికే పిలిపించుకుని మీడియా సమక్షంలో పరామర్శించారు. మీడియాతో అరగంటకుపైగా మాట్లాడిన జగన్.. ఎక్కువ సమయం రౌడీషీటర్లకు సంబంధించి, కాగితాలపై రాసుకొచ్చిన కథ చెప్పేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. నిన్నటి వరకు స్థానిక వైసీపీ నేతలు, జగన్ రోత మీడియా చేసిన ప్రచారానికి భిన్నంగా కొత్త కథ వినిపించారు.
గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్న ఆ యువకులను లంచం అడిగేందుకు కానిస్టేబుల్ వెళ్లారని, లంచం ఇవ్వలేదని దౌర్జన్యం చేశారని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతామని నిన్నటి వరకు వైసీపీ మీడియా చెబుతూ వచ్చింది. అయితే.. జగన్ మాత్రం వారందరినీ ‘అమాయకులు’గా తేల్చేశారు. ‘‘హైదరాబాద్, మంగళగిరిలో ఉండే చిన్ననాటి మిత్రులంతా తెనాలిలో కలుసుకుని, మాట్లాడుకుంటుండగా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడటం చూశారు. గొడవను ఆపడానికి ప్రయత్నించిన యువకులపై కానిస్టేబుల్ దౌర్జన్యం చేశారు. ఆయన కానిస్టేబుల్ అని కూడా వారికి అప్పుడు తెలియదు.. వారి బండి తాళాలు ఆయనే లాక్కున్నారు.’’ అని జగన్ వివరించారు. కేసులు ఎవరిపైనైనా ఉంటాయనీ, అందుకని నడిరోడ్డుపై కొడతారా అంటూ ప్రశ్నించారు. 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నటం న్యాయంగా ఉంటుందా అంటూ పొంతన లేకుండా మాట్లాడారు. వారిలో విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని, రాకేశ్ చెల్లి ఇంజనీర్ అని, ఆయన పాలిటెక్నిక్ చదువుకున్నారంటూ నల్లకోటు ఫొటోలు, పోలీసుల దాడిలో దెబ్బలు తగిలినట్టు అరికాళ్లకు బొబ్బలెక్కాయంటూ మరికొన్ని చిత్రాలు, రాకేశ్ కాళ్లలో రాడ్లు ఉన్నాయంటూ ఎక్స్రేను పదేపదే చూపిస్తూ మాట్లాడారు.