కృష్ణా జలాలను ఏపీ ఎక్కువ వాడలేదు!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:03 AM
నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కేటాయింపులను మించి వాడేసుకుందన్న తెలంగాణ వాదనతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) విభేదించింది.
కేఆర్ఎంబీ స్పష్టీకరణ.. వరద సమయంలో వాడుకున్నా వెంటనే ప్రాజెక్టులు నిండాయి: జైన్
సాగర్లో ఉన్న నీటి వినియోగంపై 2 రాష్ట్రాల సీఈలతో కమిటీ.. నేడు నల్లగొండలో భేటీ
27న బోర్డు సమావేశంలో చర్చించి నీటి కేటాయింపులపై నిర్ణయం
అమరావతి/హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కేటాయింపులను మించి వాడేసుకుందన్న తెలంగాణ వాదనతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) విభేదించింది. గత ఏడాది అక్టోబరు 27వ తేదీ వరకూ కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద వచ్చిందని.. ఈ సమయంలో ఏపీ ఆ నీటిని వాడుకున్నా.. ఈ వెంటనే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిపోయాయని కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు నుంచి నీటివాడకం మొదలైందని.. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాగర్లో నీటి నిల్వ చాలా తక్కువగా ఉన్నందున వ్యూహాత్మంగా వాడుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏపీ ఎక్కువగా వాడేసిందని.. ఇకపై ఆ రాష్ట్రానికి నీటిని విడుదల చేయొద్దని తెలంగాణ కోరింది. అయితే వరదల సమయంలో నీటిని దిగువకు వదిలేశారని.. అవి సముద్రంలోకి పోతుంటే కొంత తాము వాడుకుంటే వచ్చిన నష్టం ఏమిటని ఆంధ్రప్రదేశ్ వాదించింది. పైపెచ్చు తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం నీటిని కిందకు వదిలేయడంతో తమకు నష్టం వాటిల్లిందని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆంధ్రలోని పంటలకు నీళ్లొదిలితే.. తెలంగాణలో రాజకీయ సమస్యలు ఎదురవుతాయని ఆ రాష్ట్ర అధికారులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవడానికి ఎంత నీరు అవసరమో గుర్తించి ఇవ్వాలని అన్నారు. ఆయనతో చైర్మన్ అతుల్సింగ్ ఏకీభవించారు. కాగా.. మే, జూన్ నెలలకు తమకు 116 టీఎంసీలను విడుదల చేయాలని తెలంగాణ ఇండెంట్ పెట్టింది.
తమ రాష్ట్రంలోనూ నీటి అవసరం భారీగానే ఉందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ నీటి అవసరాలు తేల్చడానికి.. సాగర్లో మిగిలి ఉన్న జలాలను ఏ విధంగా వాడుకోవాలో అధ్యయనం చేయడానికి రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు.. నల్లగొండ సీఈ, సాగర్ కుడికాలువ సీఈతో అతుల్సింగ్ కమిటీని వేశారు. వీరు మంగళవారం నల్లగొండలో సమావేశమై రెండు రాష్ట్రాల్లో నీటి అవసరాలపై పరస్పరం చర్చించుకుని బోర్డుకు నివేదిక సమర్పిస్తారు. 27న జరిగే బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాల వినతులపై చర్చించి ఎవరికెంత కేటాయించాలో నిర్ణయిస్తారు.